IPL 2025 SRH VS RCB : ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ జట్టు.
అయితే ఈ ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో పాయింట్ల పరంగా (17) ఇరు జట్లకు ఒకటే కాగా నెట్రన్రేట్లో మాత్రం పంజాబ్ (+0.389) కంటే ఆర్సీబీ (+0.255) వెనుకబడింది. అందుకే ఆర్సీబీని వెనక్కినెట్టింది పంజాబ్. ఆ జట్టుకు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా బెంగళూరుకు ఒకటే మిగిలి ఉంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తొలి డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ (94*; 48బంతుల్లో 7×4, 5×6) అర్ధశతకంతో చెలరేగాడు. త్రుటిలో శతకం తప్పినా తన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ(34; 17 బంతుల్లో 3×4, 3×6), అనికేత్ వర్మ (26; 9 బంతుల్లో 1×4, 3×6), క్లాసెన్ (24; 13 బంతుల్లో 2×4, 2×6) బాగానే ఆడారు.
హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (4) మినహా మిగతావారంతా కనీసం ఒక్క ఫోర్ కొట్టకుండా క్రీజును వీడలేదు. అభినవ్ మనోహర్ (12; 11 బంతుల్లో 1×4), కమిన్స్ ( 13*; 6 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్, లుంగి ఎంగిడి, సూయష్, కృనాల్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా నిరాశపరిచారు. తద్వారా ఓటమి చవిచూసింది.