IPL 2025 MI VS CSK : ఐపీఎల్ 18లో ముంబయి ఇండియన్స్కు హ్యాట్రిక్ విజయం. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబయి 15.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76*), సూర్యకుమార్ యాదవ్ (68*) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి 177 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. ముంబయికిది నాలుగో విజయం కాగా, చెన్నైకిది ఆరో ఓటమి.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై, రవీంద్ర జడేజా (53*), శివమ్ దూబే (50) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నాలుగో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (5) పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ బౌలింగ్లో కీపర్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్కు దూరం కావడంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయూష్ మాత్రే (32: 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లు) భారీ షాట్లతో అలరించాడు. అయితే ఏడో ఓవర్ చివరి బంతికి చాహర్ బౌలింగ్లో శాంట్నర్కు చిక్కాడు. ఆ తర్వాత శాంట్నర్ బౌలింగ్లో షేక్ రషీద్ (19) స్టంపౌట్ అయ్యాడు.
అనంతరం జడేజా, శివమ్ దూబే కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. దూకుడుగా ఆడిన దూబే 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్వినీ కుమార్ వేసిన 16 ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో దూబే రెండు సిక్స్లు, జడేజా ఓ ఫోర్, సిక్స్ బాదారు. అనంతరం బుమ్రా వేసిన 16.2 ఓవర్కు భారీ షాట్ ఆడిన దూబే విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ ధోనీని కూడా బుమ్రానే ఔట్ చేశాడు. చివరి ఓవర్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబయి బౌలర్లలో బుమ్రా రెండు, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.