Rajasthan Royals Fixing Allegations : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా శనివారం(ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రెండు పరుగులు తేడాతో లఖ్నవూ విజయం సాధించింది. అయితే రాజస్థాన్ రెండు రన్స్ తేడాతో ఓడిపోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోషియేషన్-ఆర్సీఏ అడ్హాక్ కమిటీ కన్వీనర్ జయ్దీప్ బిహాని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ ఫలితాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, టాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు ఆటపై అనుమానాలు లేవనెత్తడమే కాకుండా ఆర్ఆర్ ఫ్రాంచైజీ, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐపై ఆరోపణలు గుప్పించారు. ఐపీఎల్ సంబంధిత కార్యకలాపాల నుంచి ఆర్సీఏ అడ్హాక్ కమిటీని పక్కన పెట్టాలని కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపాయి.
'అవి తప్పుడు వ్యాఖ్యలు'
బిహాని వ్యాఖ్యలపై రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రీడా శాఖ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. బిహానిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్పందించింది. బిహాని చేసిన వ్యాఖ్యలను తప్పుడు, నిరాధార కామెంట్లుగా కొట్టిపారేసింది. ఆర్ఆర్ టీమ్కు చెందిన ఓ అధికారి దీప్ రాయ్ ఈ మేరకు బిహానీ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
బిహాని వాదనలపై ఆర్ఆర్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "అడ్హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాము. ఇటువంటి బహిరంగ ప్రకటనలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, BCCI ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని పేర్కొంది.
రాష్ట్ర క్రికెట్ సంఘం, ప్రభుత్వంతో తమకు 18 సంవత్సరాల భాగస్వామ్యం ఉందని ఆర్ఆర్ నొక్కి చెప్పింది. బీసీసీఐ మార్గదర్శకాలకు పూర్తి కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు అధికారిక హక్కులను రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్కు ఇచ్చింది బీసీసీఐ. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించడానికి- రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో కౌన్సిల్, BCCI రెండింటితో సమన్వయంతో పనిచేస్తున్నామని ఆర్ఆర్ స్పష్టం చేసింది.
లాస్ట్ ఓవర్లో అద్భుతం- లఖ్నవూ సూపర్ విక్టరీ- పోరాడి ఓడిన రాజస్థాన్
'14ఏళ్ల కుర్రాడి ఆట చూసేందుకే నిద్ర లేచా' - వైభవ్ సూర్యవంశీపై సుందర్ పిచాయ్ పొగడ్తలు!