How to Do Pooja on Varuthini Ekadashi : హిందూ సంప్రదాయంలో ఏకాదశిని చాలా పవిత్రమైన తిథిగా భావిస్తారు. అయితే, ప్రతి నెలా శుక్ల పక్షంలో ఓ ఏకాదశి, కృష్ణ పక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఇలా వచ్చే ఏకాదశుల్లో కొన్నింటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి "వరూథిని ఏకాదశి". ఇది ఏటా చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు వస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ 24న గురువారం "వరూథిని ఏకాదశి" వచ్చింది.
ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామనావతారాన్ని ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాదు, ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇంతకీ, వరూథిని ఏకాదశి రోజు మహావిష్ణువుని ఎలా పూజించాలి? ఎలాంటి దానధార్మాలు చేయాలి? ఏవిధమైన విధివిధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
కొన్ని ముఖ్యమైన విధివిధానాలు వరూథిని ఏకాదశి రోజు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసిరావడంతోపాటు అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు సిద్ధింపచేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. ముఖ్యంగా వరూథిని ఏకాదశి రోజుఎవరైనా సరే "ఏకాదశి వ్రతం" చేస్తే 10వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుందని చెబుతున్నారు.
ఏకాదశి వత్రం అంటే ఏమిటి?
ఏకాదశి వ్రతం అంటే ఏమిటంటే, రోజు వారీ పూజలతోపాటు రోజంతా ఆహారం తీసుకోకుండా పాలు, పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు. అయితే, ఇలా రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. పగలు పాలు, పండ్లు స్వీకరిస్తూ రాత్రి పూట గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. అలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు.

ఈ దానాలు చేస్తే అద్భుత ఫలితాలు!
- వరూథిని ఏకాదశి రోజు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చినట్లయితే సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
- ఈ పవిత్రమైన రోజున ఇవ్వాల్సిన ముఖ్యమైన దానాల్లో "నీటి కుండ దానం" ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు. అంటే, ఒక కుండ నిండా నీటిని నింపి దాన్ని వరూథిని ఏకాదశి రోజు దాహంతో ఉన్నవారికి లేదా బ్రహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుందంటున్నారు.
- అలాగే, ఈరోజు ఎవరికైనా ధాన్యం దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయంటున్నారు. అయితే, ఈ దానాలను ఉపవాసం ఉండి చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
- ఒకవేళ ఉపవాసం ఉండడం కుదరని పక్షంలో నీటి కుండను దానం చేసినా అదే ఫలితం దక్కుతుందంటున్నారు మాచిరాజు.
- అదేవిధంగా, వరూథిని ఏకాదశి రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు మీ చేతితో ఆహారం, ప్రసాదం, మంచి నీళ్లు పంచి పెట్టడం వల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.
- అలాగే, ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు పండ్లు పేదలకు పంచి పెడితే మీకు చాలా కాలం నాటి నుంచి ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది.
గుడిలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అదృష్టమా? అరిష్టమా?? - శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే?

ఆచరించాల్సిన నియమాలు :
- సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర నది స్నానం చేయాలి. నది స్నానం కుదరని వాళ్లు ఇంట్లోనే పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.
- వరూథిని ఏకాదశి రోజున పూజించాల్సిన దైవం వామనుడు. అంటే, వామన రూపంలోని శ్రీ మహా విష్ణవును ప్రార్థించాలి.
- వీలైతే "దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వ దేవానాం వామనాయ నమో నమః" అనే శ్లోకాన్ని దీపారాధన అనంతరం చదువుకోవాలి.
- అది చదవడం కుదరని వాళ్లు "ఓం బాల వామన రూపిణే శ్రీ మహా విష్ణవై నమః!" అనే మంత్రాన్ని దీపం పెట్టి చదువుకున్నా సరిపోతుందంటున్నారు.
- శ్లోకం, మంత్రం కూడా చదవలేని వాళ్లు "ఓం వామనాయ నమో నమః" అని చదువుకుంటూ ఇంట్లో దీపం పెట్టండి. ఇలా చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
- ఈరోజు ఎవరైనా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే వరూథిని ఏకాదశి రోజు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపి వాటితో అభిషేకం చేయాలి.
- లేదంటే విష్ణమూర్తి విగ్రహం ఉన్నా కూడా ఈరోజున కొద్దిగా కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చంటున్నారు.
- వరూథిని ఏకాదశి నాడు వైష్ణవాలయాలైన రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహాలయాను దర్శించి, ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించండి. ఆ ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయండి.
- అదేవిధంగా "ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నారాయణాయ, ఓం వామనాయ నమః" అనే మంత్రాలను వీలైనన్ని సార్లు ఈరోజు చదువుకోవాలి.
- ఇలా ప్రత్యేకమైన విధి విధినాలు పాటిస్తూ వరూథిని ఏకాదశి రోజు వామనుడిని పూజిస్తే కష్టాలన్ని తొలగిపోయి ఏడాది మొత్తం సమస్త శుభాలు సిద్ధింపచేసుకోవచ్చని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శని బాధలు పోవాలా? సకల శుభాలు కలగాలా? శనివారం ఇలా చేస్తే చాలు!
"దీపారాధన విషయంలో ఈ తప్పులు చేస్తే - పనుల్లో ఆటంకాలు" - ఈ నియమాలు తప్పనిసరి!