Vaisakha Purnam 1st Chapter : తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తికం ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఈ వైశాఖ పురాణాన్ని క్రమం తప్పకుండా 30 రోజుల పాటు చదివితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి అంత్యమున విష్ణు సాయుజ్యాన్ని పొందుతారని పురాణ వచనం. ఈ కథనంలో వైశాఖ పురాణం మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం.
వైశాఖ పురాణం మొదటి అధ్యాయం
పూర్వం నైమిశారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులతో "ఓ మునులారా! ఒకానొకప్పుడు అంబరీషుడు నారద మహర్షితో వైశాఖ మాస మహత్యం గురించి వివరించామని అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు.
నారదుడు అంబరీషుల సంవాదం
నారదుడు అంబరీషునితో "ఓ రాజశ్రేష్టా! పూర్వం ఒకప్పుడు నేను మా తండ్రిగారైన బ్రహ్మను మాసముల మహత్యాన్ని వివరించమని అడిగాను. అప్పుడు నా తండ్రి నాతో "కుమారా! నారాయణుడు తన ప్రియపత్ని లక్ష్మీదేవికి స్వయంగా వివరించిన విషయాలే నీకు చెబుతాను శ్రద్ధగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.
నారదుడు బ్రహ్మ సంవాదం
బ్రహ్మ దేవుడు నారదునితో లక్ష్మీనారాయణుల సంవాదం గురించి చెప్పసాగెను. నారాయణుడు చెప్పిన ప్రకారం మాసములలో కెల్లా కార్తికం, మాఘం, వైశాఖ మాసాలు అత్యుత్తమమైనవి. సకల అభీష్టాలను సిద్ధింపజేసే వైశాఖ మాసంలో చేసే నదీస్నానం, దానం, జపతపాదులు సకల పాపాలను నశింపజేస్తాయి. వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించే వారిని దేవతలు సైతం గౌరవిస్తారంట!
వైశాఖ స్నానంతో అశ్వమేధయాగం ఫలం
మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయ సమయంలో నదీ తటాకాదులలో ఎవరు స్నానం చేస్తారో వారిని శ్రీలక్ష్మీనారాయణులు ఉద్ధరిస్తారు. శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి పట్ల ప్రీతి చెంది అనేక వరములను అనుగ్రహిస్తాడు. వైశాఖ మాసంలో ఒకసారి మాత్రమే స్నానం, పూజ చేస్తే పాప విముక్తుడై విష్ణులోకమును చేరుకుంటారు. వైశాఖమున వారం రోజులపాటు నదీస్నానం చేస్తే ఆ శ్రీహరి అనుగ్రహంతో కొన్నివేల అశ్వమేధయాగములను చేసిన ఫలితం కలుగుతుంది. వైశాఖంలో నదీస్నానం చేయడానికి వీలు కానీ వారు కేవలం స్నానం చేయాలనీ సంకల్పం చేసినంత మాత్రాన్నే నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యం పొందుతారు. సూర్యుడు మేషరాశిలోనుండగా పవిత్ర నదీజలాల్లో వైశాఖస్నానము చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నవారు కూడా శాశ్వత విష్ణు సాయుజ్యమును పొందుతారు.
నారద అంబరీష సంవాదం
బ్రహ్మ నారదునితో చెప్పిన వైశాఖ మహత్యాన్ని అంబరీషునికి వివారించిన నారదుడు తిరిగి అతనితో "ఓ అంబరీష మహారాజా! సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు పవిత్ర నదీ జలాల్లో చేరి ఉంటారు కాబట్టి ఆ సమయంలో నది స్నానమాచరించిన వారికి శ్రేయస్సును శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు." అని చెబుతూ నారదుడు మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసాడు.
వైశాఖ పురాణం మొదటి అధ్యాయము సంపూర్ణము
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.