Ram Tirath Temple Amritsar : సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చిన పవిత్ర ప్రదేశం, హనుమంతుని లవకుశులు బంధించిన ప్రదేశం, వాల్మీకి రామాయణాన్ని రచించిన పుణ్యప్రదేశం ఎక్కడుందో తెలుసా! రామాయణంలోని అనేక ఘట్టాలతో ముడిపడి ఉన్న ఆ పవిత్రం ప్రదేశం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ రామతీర్థ దేవాలయం, అమృత్సర్
రావణాసుర సంహారం తరువాత లంక నుంచి తిరిగి వచ్చిన రాముడు కొన్ని కారణాల వల్ల సీతాదేవిని గర్భవతి అని కూడా చూడకుండా అడవులకు పంపిస్తాడు. ఆ సమయంలో సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందిన ప్రదేశం శ్రీరామతీర్థం. ఈ ప్రదేశంలో సీతాదేవి లవకుశులకు జన్మనిస్తుంది.
సీతమ్మకు వాల్మీకి మహర్షి ఆశ్రయం
అడవులకు వెళ్లిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పిస్తాడు. ఈ ఆశ్రమమే అమృత్సర్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ వాల్మీకి తీర్థ స్థల్. దీనినే రామ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.
లవకుశుల జననం
ఈ రామతీర్థంలోనే ఆ సీతాదేవి కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారివురే లవ కుశలు. వీరిద్దరూ తండ్రి శ్రీరాముడికి తగ్గ వారసులు. పరాక్రమంలో తండ్రిని మించినవారు. అందుకే వారి ఖ్యాతి ఈ విశ్వం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.
అశ్వమేధ యాగం
రాజపురోహితుల సూచన మేరకు శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తారు. యాగ ధర్మాన్ని అనుసరించి యాగాశ్వాన్ని స్వేచ్ఛగా వదులుతారు. ఆ గుర్రం తిరిగిన ప్రాంతం అంతా ఆ రాజు పాలన కిందికి వస్తుంది. ఇది ఆ కాలంలోని ధర్మాన్ని అనుసరించి నిర్ధరించిన నియమం. ఎవరైనా ఆ గుర్రాన్ని బంధించి ఆ రాజు సైన్యంతో యుద్ధం చేసి గెలిస్తే వారికి ఆ రాజ్యం దక్కుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి వదిలిన అశ్వాన్ని లవకుశలు ఈ రామ తీర్థంలోనే బంధిస్తారు.
శ్రీరాముని సైన్యానికి ఎదురు నిలిచిన లవకుశులు
యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన శ్రీ రాముడి సైన్యాన్ని లవకుశులు తమ శౌర్య పరాక్రమాలతో ఎదిరిస్తారు. అటు పై యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన ఆంజనేయుడిని కూడా లవకుశులు ఇక్కడే బంధించారని స్థల పురాణం చెబుతోంది. శ్రీరామ తీర్థ ఆలయంలో లవకుశులు, శ్రీరాముని సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది.
ఈ ప్రదేశంలోనే రామాయణ రచన
ఈ ఆశ్రమంలో వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం రచించారు. ఈ కారణాల వల్ల శ్రీ రామతీర్థ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన రామ మందిరాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
దుర్గాదేవి ఆలయం
లవకుశులు ఆ ఆంజనేయుడిని కట్టేసిన చెట్టు ప్రాంతంలో ప్రస్తుతం దుర్గా దేవి దేవాలయం ఉంది. ఈ దుర్గా దేవి దేవాలయం లాహోర్ గేట్ సమీపంలో ఉంది.
దుర్గాదేవి ఆలయ విశేషాలు
దుర్గా దేవి దేవాలయం హిందువుల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ పార్వతీ దేవి దుర్గా దేవి రూపంలో కొలువై ఉంది. పంజాబ్లోని గోల్డన్ టెంపుల్ తరహాలో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.
సిల్వర్ టెంపుల్
ఈ దుర్గా దేవి దేవాలయ ద్వారాలను స్వచ్ఛమైన వెండితో తయారు చేయడవం వల్ల దీనిని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా ఉండటం గమనార్హం. ఈ దేవాలయ ప్రాంగణంలో హిందూ దేవతలైన దుర్గాదేవి, సీతా దేవితో పాటు పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు.
బంగారు వాల్మీకి విగ్రహం
రామతీర్థంలో 8 అడుగుల ఎత్తైన వాల్మీకి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ విగ్రహాన్ని 800 కిలోల బంగారు రేకులతో తాపడం చేయించారు.
పూజోత్సవాలు
శ్రీరామ తీర్థ ఆలయంలో శ్రీరామనవమితో పాటు దసరా, జన్మాష్టమి, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులే కాకుండా దేశంలోని నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రామతీర్థ దేవాలయం గురించి విన్నా, చదివినా ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.