Telangana Panchayat Elections Results2025

ETV Bharat / spiritual

కార్తిక పూర్ణిమ సాయంత్రం - తులసి కోట వద్ద తల్లులు ఇలా పూజ చేస్తే - పిల్లల జీవితం బాగుంటుందట!

నవంబర్​ 15 శుక్రవారం కార్తిక పౌర్ణమి పూర్ణిమ రోజు తులసి కోట వద్ద చేయాల్సిన ప్రత్యేక పూజ

Puja at Tulasi Fort on Kartika Poornami
Puja at Tulasi Fort on Kartika Poornami (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2024 at 4:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

Puja at Tulasi Kota on Kartika Poornami: హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తికం. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధాన, దీప దానాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇక ఈ నెల మొత్తంలో ఒక్కోరోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. ఈ రోజున చంద్రుడికి పూర్తిగా శక్తి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. అయితే ఈ రోజున సాయంత్రం తులసికోట దగ్గర తల్లులు ఈ పూజ చేస్తే సంవత్సరం మొత్తం పిల్లల జీవితం బాగుంటుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతున్నారు. మరి ఆ పూజ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పూజ చేసే విధానం:

  • కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసి తులసి కోట ముందు అలికి ముగ్గులు పెట్టుకోవాలి.
  • అలాగే పుష్పాలతో తులసి కోటను అలంకరించుకోవాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపారాధన చేయాలి.
  • దీపారాధన అనంతరం ఉసిరిక దీపాలు వెలిగించాలి. అంటే ఉసిరికాయ పైన చెక్కును కొద్దిగా తీసి.. ఆవు నేతిలో ముంచిన కుంభ వత్తిని దాని మీద ఉంచి దీపాలు వెలిగించాలి.
  • ఉసిరిక దీపాలు వెలిగించిన అనంతరం ఓ తమలపాకును తులసి కోట వద్ద ఉంచాలి. ఆ తమలపాకులో ఓ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లను ఉంచాలి. ఆ తర్వాత దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ నాణెంను సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించాలట!.
  • ఆ తర్వాత "ఓం సోం సోమాయ నమః" అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లను పూలు, అక్షతలతో పూజించాలి.
  • ఆ మంత్రం చదివిన తర్వాత అగరబత్తీలు వెలిగించి, హారతి చూపించాలి. అనంతరం అరటిపండు ముక్కలు, చలివిడి, పాలల్లో అటుకులు కలిపి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత వాటిని పిల్లలకు తినిపించాలి.
  • అనంతరం ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్లకు నమస్కారం చేసి ఆ బిళ్లను తీసుకుని ఇంట్లో మీ పిల్లలు చదువుకునే గదిలో పెట్టాలి. అలా డైరెక్ట్​గా పెట్టకుండా ఓ గిన్నె తీసుకుని అందులో నాణెం పెట్టి గదిలో ఉంచాలి.
  • ఆ తర్వాత వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం వేసి కలిపి ఓ 15 నిమిషాల పాటు ఆ పాలను వెన్నలలో ఉంచి అనంతరం తులసి కోట వద్ద పెట్టి నమస్కారం చేసిన తర్వాత ఆ పాలను కూడా పిల్లలతో తాగించాలి.
  • కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర ఇలా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ల పిల్లలపై చంద్రబలం పూర్తిగా ఉండి.. సంవత్సరమంతా పిల్లల జీవితం బాగుంటుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తిక సోమవారం వీటిల్లో ఏ ఒక్క పని చేసినా - శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట!

కార్తిక పౌర్ణమి రోజు "నక్షత్ర దీపారాధన" చేస్తే - గ్రహ, జాతక దోషాలన్నీ తొలగిపోతాయట!