Hanuman Removes Shani Effects : హనుమంతుడు అపారమైన బలపరాక్రమాలకు, స్వామిభక్తికి నిదర్శనం. పురాణాల ప్రకారం హనుమను పూజిస్తే కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయని విశ్వాసం. అయితే మానవ జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపించే ఏలినాటిశని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి సమస్యలకు ఆంజనేయస్వామి ఆరాధన సులభమైన పరిష్కారమని శాస్త్రం చెబుతోంది. అసలింతకీ ఆంజనేయస్వామికి, శనిదేవుని ఉన్న సంబంధమేమిటి? హనుమ ఆరాధనతో నిజంగానే ఏలినాటి శని బాధలు తొలగిపోతాయా? ఈ ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హనుమ భక్తుల జోలికి రాని శని
సాధారణంగా మానవులను ముప్పతిప్పలు పెట్టే శనిభగవానుడు హనుమాన్ భక్తుల జోలికి మాత్రం రాడంట! అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలంటే రామాయణంలోని ఓ ఘట్టం గురించి తెలుసుకోవాల్సిందే!
రావణాసురునితో భీకర యుద్ధం - మూర్ఛిల్లిన లక్ష్మణుడు
పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తున్న శ్రీరాముని భార్య సీతను రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి లంకలో దాచి ఉంచుతాడు. హనుమంతుని సహాయంతో సీత జాడను కనిపెట్టిన శ్రీరాముడు లంక చేరి రావణాసురునితో భీకర యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో మైరావణుడు మాయాశక్తులతో లక్ష్మణుడిని, మరికొంతమంది వానరులను గాయపరిచి, వారిని మూర్ఛిల్లేలా చేశాడు.
సంజీవని పర్వతం కోసం హిమాలయాలు వెళ్లిన హనుమ
శ్రీరాముని ఆజ్ఞతో హనుమంతుడు హిమాలయాలలోని సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి వాయువేగంతో బయలుదేరి వెళ్తాడు.
శుక్రాచార్యుని దుష్టబుద్ధి
హనుమ సంజీవిని మూలికలను తెస్తే మూర్ఛపోయిన వారందరూ తిరిగి శక్తివంతులు అవుతారని, ఆ తర్వాత వారితో పోరాడటం అసాధ్యమని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు, ఆటంకాలు సృష్టించడంలో శక్తిమంతుడైన శనిదేవుని హనుమను అడ్డుకోమని ఆదేశిస్తాడు.
హనుమను అడ్డుకున్న శనిదేవుడు
హిమాలయాలకు చేరుకున్న హనుమ సంజీవని మూలికల కోసం అంతా వెతుకుతాడు. కానీ వాటిని గుర్తించలేకపోతారు. దీనితో హనుమ సంజీవని పర్వతాన్ని మొత్తం పెకిలించి తిరిగి ఆకాశమార్గాన లంకకు బయల్దేరుతాడు. ఆ సమయంలో హనుమను శని అడ్డగిస్తాడు. హనుమతో శని తాను రావణాసురుడు పంపగా వచ్చానని, ఈ పర్వతాన్ని తీసుకువెళ్లడానికి వీల్లేదని వాదిస్తాడు. ఈ మాటలకు హనుమంతుడికి తీవ్రమైన కోపం వస్తుంది.
శనిని తన పాదాల కింద తొక్కిపెట్టిన హనుమ
లక్ష్మణుని ప్రాణాలు కాపాడటానికి వెళ్తున్న తనను అడ్డుకున్నందుకు హనుమకు శనిపై తీవ్రమైన కోపం వచ్చింది. కానీ, తన ఆవేశాన్ని నియంత్రించుకుంటూ రామనామ జపం చేస్తూ తన పాదాలతో శని ఊపిరి ఆడకుండా తొక్కిపెడతాడు.
శరణు కోరిన శనిదేవుడు
హనుమంతుని శక్తిని తెలుసుకున్న శని, చివరకు తాను హనుమను అడ్డుకోవడం తప్పని, క్షమించమని కోరుకున్నాడు. శని పడుతున్న బాధను చూసి జాలిపడిన హనుమంతుడు, కొన్ని షరతులు విధిస్తూ అతడిని విడిచిపెడతాడు.
హనుమ, శనికి విధించిన షరతులు
- ప్రతినిత్యం శ్రీరామనామ జపం చేసేవారికి ఎన్నడూ శని బాధలు ఉండకూడదని షరతు పెడతాడు.
- అలాగే హనుమను నిత్యం పూజించేవారికి ఎప్పటికీ శని బాధలు కలిగించకూడదని, వారిపై కనీసం శని దృష్టి కూడా పడకూడదని ఆజ్ఞాపిస్తాడు.
హనుమ షరతులు అంగీకరించిన శనిదేవుడు
హనుమ షరతులకు శని దేవుడు అంగీకారం తెలుపుతూ, హనుమను ఒక వరం కోరుతాడు. హనుమంతుడి దేవాలయాలు ఉన్న చోట తన విగ్రహం కూడా ఉండాలని, ప్రతి శనివారం తనకూ అభిషేకాలు జరిగేలా చూడాలని శని కోరుతాడు.
శనిదేవుని అనుగ్రహించిన హనుమ
హనుమంతుడు శని కోరికను మన్నించి, అతడిని ఆశీర్వదించి పంపిస్తాడు. అందుకే సాధారణంగా హనుమ ఆలయాలలో హనుమ పాదాల కింద శని ఉండడం గమనించవచ్చు. అందుకే హనుమను ఆరాధించిన వారికి శని అనుగ్రహం ఉంటుంది.
శని బాధలు నుంచి ఉపశమనం
ఆనాటి నుంచి శని బాధలు, ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉన్నవారు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు, ఆకుపూజ, వడమాల వంటివి సమర్పించడం ద్వారా శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ప్రతి శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి శని బాధల నుంచైనా ఉపశమనం పొందవచ్చునని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.
ప్రతి శనివారం హనుమను ఆరాధించడం ద్వారా శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. - జై శ్రీరామ్!