Bhanu Saptami Puja Vidhi in Telugu: హిందూ సంప్రదాయంలో రోజూ ఓ దేవుడిని పూజిస్తారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయస్వామి ఇలా ఆదివారం రోజు సూర్యభగవానుడిని పూజిస్తారు. ఆ రోజున సూర్యోదయం సమయంలో అర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యం, సుఖసంపదలు ఇస్తుందని విశ్వాసం. మామూలు ఆదివారాలతో పోలిస్తే భాను సప్తమి రోజు సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలవంతమైనదని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు భానుసప్తమి అంటే ఏమిటి? ఎప్పుడు వచ్చింది? ఆరోజు చేయాల్సిన పనులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అంటారని ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు. ఈ ఏడాది భానుసప్తమి ఏప్రిల్ 20వ తేదీ వచ్చిందని, ఈ పండగనే విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా అంటారని వివిరిస్తున్నారు. ఆదివారం సప్తమి తిథితో వచ్చిన భాను సప్తమి రోజు స్నానం, దానం, దీపం, అర్ఘ్యం చేయడం వల్ల సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందని, దీని వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయని, రాజకీయాల్లో పదవులు వస్తాయని, సంవత్సరాల తరబడి ఉన్న ఆస్తి తగాదాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.
స్నానం ఎలా చేయాలంటే:
- భానుసప్తమి రోజు ఇంట్లో తూర్పు దిక్కున ఓ పీట ఉంచాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పిండితో వృత్తాకారంలో ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచి బిందె పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర దర్భలు లేకపోతే ముగ్గు వేసి బిందె పెడితే సరిపోతుంది.
- ఆ బిందెలో నీళ్లు నింపి అందులో ఎర్రటి పుష్పాలు వేసి ఓ 5 నిమిషాలు ఉంచాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత ఆ బిందెలోని నీళ్లను కొద్దిగా తీసుకుని స్నానం చేసే నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయాలని అంటున్నారు.
- బిందెలో మిగిలిన నీటిని స్నానం చేసిన తర్వాత ఇంట్లోని అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయాలని అంటున్నారు. ఇలా భానుసప్తమి రోజు స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
అర్ఘ్యం ఎలా సమర్పించాలి: స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకుని, అందులోకి ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షతలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి "ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం" అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీటిని కిందపడనివ్వకుండా ఓ ప్లేట్ పెట్టి, ఆ నీటిని అనంతరం చెట్లకు పోయాలంటున్నారు. లేదంటే తూర్పు వైపు చెట్లకు నీళ్లు పోస్తూ అర్ఘ్యం ఇచ్చినా సరిపోతుందంటున్నారు.

ద్వాదశ ఆదిత్య దీపం:
- అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇంట్లోని ఏదైనా గదిలో తూర్పు దిక్కులో పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత బియ్యప్పిండితో ముగ్గు వేయాలి.
- ఆ ముగ్గు మీద పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి. ఆ నూనెలో పన్నెండు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. అంటే రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి. ఇలా 12 వత్తులు సిద్ధం చేసుకోవాలి.
దానం ఏం చేయాలి: భానుసప్తమి రోజు ఉదయం ఆరు నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకటింపావు కేజీల గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెబుతున్నారు.

భానుసప్తమి ఉపవాసం: విశేషమైన భానుసప్తమి రోజు ఉపవాసం ఉండటం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు చెబుతున్నారు. ఆరోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

జపించాల్సిన మంత్రం: భానుసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన మంత్రం జపించడం వల్ల స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని అంటున్నారు. ఆ మంత్రం ఏమిటంటే "ఓం సవిత్రే నమః". ఇలా భానుసప్తమి రోజు స్నానం, అర్ఘ్యం, దీపం, దానం, ఉపవాసం, మంత్రం ఈ ఆరింటిలో ఏదీ చేసినా సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు చెబుతున్నారు. ఒకవేళ ఈవేవి చేయలేని వారు పైన చెప్పిన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే సరిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా సూర్యష్టకం, ఆదిత్య హృదయం విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయని, ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయని సూచిస్తున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"దీపారాధన విషయంలో ఈ తప్పులు చేస్తే - పనుల్లో ఆటంకాలు" - ఈ నియమాలు తప్పనిసరి!
'చండీ యాగం'తో దుర్గాదేవి అనుగ్రహం- చూసినా, హోమగుండానికి నమస్కరించినా విశేష ఫలం!