Minister Vasansetty Subhash Comments on YS Jagan: 10 ఏళ్లపాటు వైఎస్సార్సీపీలో క్రియాశీలంగా ఉన్నానని, తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారు కానీ ఆ పదవి తీసుకుని ఉంటే ప్రజలు రాళ్లతో కొట్టేవారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆదివారం నిర్వహించిన సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలో మంత్రి మాట్లాడారు. వైఎస్సార్సీపీ పాలకులు చిట్టచివరి రోజుల్లో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి కలవమన్నారని తెలిపారు. మిథున్రెడ్డిని కలిశాక ధనుంజయరెడ్డి దగ్గరకు వెళితే జగన్కు సాష్టాంగ నమస్కారం చేయాలని సూచించారని దాంతో తను కంగుతిన్నట్లు మంత్రి సుభాష్ వివరించారు.
జగన్ను సార్ అనలేదనే రఘురామపై కక్ష: తమ జిల్లాకు చెందిన మంత్రి వేణు ఇలానే చేస్తారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకే కాదు వైఎస్సార్సీపీ నాయకులకూ చుక్కలు చూపించారని మంత్రి సుభాష్ తెలిపారు. జగన్ తీరుతో విసుగు చెందిన సొంత పార్టీ నాయకులు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు నాడు ఎంపీగా ఉన్నప్పుడు 'జగన్ను సార్' అనలేదని అంతే కాకుండా ఆయన ముందు కాళ్లపై కాళ్లు వేసుకుని దర్జాగా కూర్చున్నారనే కారణాలతో రఘురామపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు.
కోట్లు సంపాదించినా సేవాగుణం లేదు: జగన్ బయటకు రాకుండా డార్క్రూమ్లో కూర్చొని నలుగురితో వ్యవస్థలను నడిపించేవారని మంత్రి అన్నారు. మళ్లీ తానే సీఎంను అవుతానని భావించి విశాఖలో పదవీ ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. కానీ ఎన్నికలలో ఫలితాలు తారుమారు కావడంతో ఏంచేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుడమేరు వరదల సమయంలో జగన్ రూ.కోటి సాయం చేస్తానని చెప్పారు కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని వివరించారు. చెల్లి ఆస్తుల విషయంలోనూ జగన్ జోక్యం చేసుకుంటున్నారని రూ.కోట్లు సంపాదించినా జగన్కు సేవాగుణం లేదని మంత్రి సుభాష్ విమర్శించారు.
వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చే సరికి జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. జగన్ను సర్ అని సంబోధించకపోవడం, కాలు మీద కాలు వేసుకుని కుర్చోవడం వల్లే రఘురామను ఇబ్బంది పెట్టారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామమని తాడేపల్లి పిలిచి జగన్కు సాష్టాంగ నమస్కారం చేయాలని మిధున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు చెప్పారు. జగన్ను కలవాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొచుకున్న ఆస్తిని కూడా జగన్ కష్టార్జితంలా భావిస్తున్నారు. జగన్ తీరు వల్లే వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయి.- వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ మంత్రి
కుల, మత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారు - సీఎం చంద్రబాబు ఆగ్రహం
'తప్పు చేసినవారి బట్టలూడదీస్తాం' - పోలీసులపై జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు