CM Revanth Reddy Serious at CLP Meeting : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో సీరియస్ అయ్యారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో సీఎం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముందు మాట్లాడారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు.
ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదు : మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠాన నిర్ణయమే ఫైనల్ అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగంలేదన్నారు. జనంలోకి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాలన్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
సన్నబియ్యం పథకం ఒక అద్భుతం : ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని సీఎం పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని సీఎం వివరించారు. భూ భారతిని రైతులకు చేరవేయాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచిందని క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకే అందాలని దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వారికి శాశ్వత పరిష్కారం చూపాం : కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామన్న సీఎం విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని ఇది ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని వెల్లడించారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు.
విష ప్రచారం చేస్తున్నారు : హెచ్సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని, ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు.
తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోంది : మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారని ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారన్నారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నారని తెలిపారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందన్నారు రాయబోతోందన్నారు.
దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోందని తెలిపారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయన్నారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న బియ్యం మన పథకం మన పేటెంట్, మన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
పార్టీ గీత దాటొద్దు - ఏదున్న నాతో చెప్పండి - సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్ - ఆ విషయాలపై ప్రత్యేక చర్చ