CM Revanth Reddy Comments On KCR : సభకు రాని ప్రతిపక్ష నాయకుడికి ప్రశ్నించే హక్కు ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రజా నాయకుడిగా పని చేయకపోవడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా సరే ప్రజల వద్దకు ఎందుకు వెళ్లలేదని రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నవేశారు. ఇటీవల జరిగిన వరంగల్ సభలో కడుపు నిండా విషం పెట్టుకుని ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మహాత్మ బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఆయన పలు విమర్శలను గుప్పించారు. 12వ శతాబ్దంలోని బసవన్న సమాజంలో రావాల్సిన మార్పుల గురించి కృషి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వ పాలన చేస్తున్నామన్నారు.
ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు : ఈ క్రమంలోనే ప్రభుత్వంపై కోపంతో కొందరు అబద్దాలు మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కుతున్నారని, ప్రతిపక్షంగా వారి బాధ్యతను నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 'తెలంగాణ విలన్ కాంగ్రెస్' అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్న రేవంత్ రెడ్డి, 100 ఎలుకలను తిన్న పిల్లి ఇప్పుడు మారిపోయానని యాత్రకు పోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే అధికారం వారికి ఉందని, అదే క్రమంలో మంచి పాలన కోసం తగు సలహాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పథకాలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
బలహీన వర్గాల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు : మానవులంతా ఒక్కటేనని చెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భావ స్వేచ్ఛ కోసం మండపాలను బసవేశ్వరుడు ఏర్పాటు చేశాడని, ఇదే తరహాలో ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనేక పథకాలతో రైతుల నుంచి మహిళల దాకా అందరూ వృద్ధి చెందేలా వారికి తోడ్పాటును అందిస్తున్నామని, రుణాలను ఇస్తున్నామని తెలిపారు. బలహీనవర్గాల అభివృద్ధి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు.
అసమానతలను తొలగించేందుకు బసవేశ్వరుడు చేసిన కృషి విశేషమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయం జరగడం కోసం 42 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. రాజీవ్ యువశక్తి పేరుతో రాష్ట్ర యువతకు తోడ్పాటును అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇకపై కూడా బసవేశ్వరుడికి స్ఫూర్తితో పరిపాలన సాగిస్తామన్నారు.
గీత దాటితే ఊరుకునేది లేదు - సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
తెలంగాణలో బలహీవర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మోదీకి కష్టమేంటి? : సీఎం రేవంత్ రెడ్డి