ETV Bharat / politics

పోటీ కోసమే ర్యాంకులు - ఎవరినీ తక్కువ చేయడానికి కాదు: సీఎం చంద్రబాబు

ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్‌ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు - టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని వెల్లడి

Chandrababu_on_ministers_ranks
Chandrababu_on_ministers_ranks (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 7, 2025 at 3:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

CM Chandrababu on Ministers Ranks in Clearance of Files: అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్​తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్​లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని తెలిపారు.

దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు, అలాగే ఎవరినీ తక్కువ చేయడానికి కాదని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పని చేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇదని తెలిపారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని అన్నారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్​తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు - ఇలా డౌన్​లోడ్ చేసుకోండి

ప్రతి ఒక్కరూ కష్టపడాలి: గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని సీఎం అన్నారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని సీఎం సూచించారు. 'పీపుల్ ఫస్ట్' విధానంతో తాను, తన కేబినెట్ సహచర మంత్రులంతా పని చేస్తున్నామని వివరించారు. ఈ మేరకు లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పని చేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - బయటపడ్డ ఉపాధ్యాయుల బాగోతం

ఓవైపు పచ్చని పొలాలు, మరోవైపు కృష్ణమ్మ - మధ్యలో బాహుబలి బ్రిడ్జి - ఇవిగో డ్రోన్ విజువల్స్