BRS Silver Jubilee Celebration : బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(రేపు) సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనాతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ ప్రాంగణాన్ని మాజీమంత్రి హరీశ్రావు పరిశీలించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సభ కోసం కాంగ్రెస్ నాయకులు సైతం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
"మా పార్టీ కోసం తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వారుగా ఈ సభకు పోవాలి. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనే ఉత్సాహం వారిలో కనిపిస్తుంది. నిజానికి ప్రజలకే కాదు కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉంది ఉత్సాహం. ఎవరెన్ని తంటాలు పడిన మళ్లీ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో కనిపించడం లేదు." - హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఎడ్లబండ్ల ర్యాలీగా సభకు బీఆర్ఎస్ శ్రేణులు : రేపు జరగబోయే రజతోత్సవ సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, సన్నాహక సమావేశాలు, భారీ వాహన ర్యాలీలు నిర్వహించాయి. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం పగడపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడుతూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సూర్యాపేట నుంచి రైతులు చేపట్టిన ఎడ్లబండ్ల ర్యాలీ హనుమకొండకు చేరుకుంది.
ఎడ్లబండ్ల ర్యాలీకి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ స్వాగతం పలికారు. ఎడ్లబండ్లపై ర్యాలీగా వచ్చిన రైతులను పూలదండలు, శాలువాలతో సత్కరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. రజతోత్సవ సభ కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
కేసీఆర్కు రాష్ట్ర ప్రజలకు ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవసభ గోడపత్రికను ఆవిష్కరించారు. రేపటి సభ అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు. మలక్పేట్లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించారని బీఆర్ఎస్ యువజన నాయకులు ఆరోపించారు. ఫ్లెక్సీల తొలగింపునకు జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలని లేనిపక్షంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరన్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. రజతోత్సవ సభకు దాదాపు 10లక్షల మంది తరలివస్తారని అంచనా మేరకు నిర్వహకులు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. దూరం నుంచి చూసేవారి కోసం సభ పరిసరాల్లో LED తెరలను సైతం సిద్ధం చేశారు.
'పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన' అంటూ మరో కొత్త పాట
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు