Bharath Summit-2025 : హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 'భారత్ సమ్మిట్-2025'కి సర్వం సిద్ధమైంది. హెచ్ఐసీసీలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసిన సర్కార్, దాదాపు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పట్టాలు తప్పుతున్న తీరు, దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రోనీ క్యాపిటలిజంతో అసమానతలు పుట్టుకొస్తున్న వేళ ఇవాళ, రేపు జరిగే భారత్ సమ్మిట్ కీలకం కానుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవాళ, రేపు జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పనులను పర్యవేక్షించారు. ప్రతినిధుల సమావేశ మందిరం, కాన్ఫరెన్స్ హాల్, జస్టిస్ హాల్, లిబర్టీ హాల్, ఎక్స్పో పాత్ ఆఫ్ జస్టిస్ హాల్, ఫొటో ఎగ్జిబిషన్తో పాటు రిసెప్షన్ ఎదురుగా చరఖాపై నూలు వడుకుతున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తదితర ప్రాంతాలను నేతలు పరిశీలించారు.
ప్రపంచ ప్రగతి శీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో 'భారత్ సమ్మిట్-2025' అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సర్కార్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ రాజకీయ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి మించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవనున్నారు. ప్రజా ప్రతినిధులు, నేతలు, నిపుణులు సదస్సులో పాల్గొంటారన్న భట్టి విక్రమార్క, ప్రపంచ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం తదితర అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. అదేవిధంగా మలేషియా న్యాయశాఖ మంత్రి కులశేఖరన్, అర్జెంటీనా, స్వీడన్ దేశాల విదేశాంగ శాఖ మాజీ మంత్రులు జార్జ్ థయానా, ఆన్లైండే, కొలంబియా కార్మిక శాఖ మాజీ మంత్రి క్లారా లోపెజ్, క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత ఎమిలియో లోజెడా, పలువురు కాంగ్రెస్ నేతలు సదస్సుకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పట్టాలు తప్పుతున్న ప్రజాస్వామ్యం, దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రోనీ క్యాపిటలిజంతో పెరుగుతున్న అసమానతలు, పౌర హక్కులను కాలరాస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నిటి దృష్ట్యా భారత్ మరోసారి ప్రపంచానికి దారి చూపాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి విజన్ను సదస్సులో వివరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించి యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు.