Ministers Angry on YSRCP Leaders in Tirumala Issue: వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని కంకణం కట్టుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారులపై విమర్శలు చేయడం, పాలకవర్గాన్ని అవమానకరంగా దూషించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. భక్తులకు మెరుగైన సేవలు కోసం సూచనలు చేయకుండా బురద జల్లుతున్నారని అన్నారు. తిరుమల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మంత్రి ఆనం ధ్వజమెత్తారు.
డిక్లరేషన్ ఇవ్వని వాళ్లు నిందలు ఎలా వేస్తారు: తిరుమల పవిత్రత గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్సీపీకి లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్వామివారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ కూడా ఇవ్వని వాళ్లు తమపై నిందలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కుల మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించమన్నారు. తండ్రి, బాబాయ్తో శవ రాజకీయాలు చేసి అభాసుపాలైన వాళ్లు ఇప్పుడు మూగ జీవాలనూ వదలట్లేదని విమర్శించారు. తిరుమల శ్రీవారి గోవులను కూడా శవ రాజకీయాలకు వాడుకోవడం వైఎస్సార్సీపీకే చెల్లిందని ఎద్దేవా చేసారు.
తిరుపతిలో వేడెక్కన రాజకీయం - కూటమి, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం
సవాల్ స్వీకరించేందుకు భయపడ్డారు: తిరుమల గోశాల విషయంలో వైఎస్సార్సీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మరోసారి స్పష్టమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తెలుగుదేశం విసిరిన సవాల్ను స్వీకరించేందుకు వైఎస్సార్సీపీ నేతలు భయపడ్డారని అన్నారు. టీటీడీ విషయంలో వైఎస్సార్సీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని అన్నారు. గోవుల పేరుతో కరుణాకర్రెడ్డి చేసిన అసత్య ప్రచారాలను నిరూపించలేకపోయారని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి గోశాల వరకు వచ్చి గడ్డి పరకంత వాస్తవం కూడా చూపించకుండానే వెళ్లిపోయారని ఎద్దేవా చేసారు. ప్రశాంత వాతావరణం కాపాడేందుకు ఐదుగురితో రమ్మని పిలిస్తే 500 మందితో విధ్వంసం సృష్టించాలనుకుంటారా అని ప్రశ్నించారు.
రోడ్డుపై కూర్చొని డ్రామాలు చేస్తున్నారు: టీటీడీ గోశాలలో గోవులు సహజంగా మరణిస్తే వైఎస్సార్సీపీ తన ఉనికి చాటుకునేందుకు గోవులపై రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. గోవుల మరణాలు నిరూపిస్తామని సవాల్ విసిరిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని అసత్య ప్రచారాలు చేస్తు రోడ్డుపై కూర్చొని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారిపై భక్తి, నమ్మకం లేక కొండపై నల్లరాయి తప్ప ఏముందని మాట్లాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని మండిపడ్డారు.
టీటీడీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు - భూమనకు కూటమి ఎమ్మెల్యేలు ఫోన్
తిరుమలపై వైఎస్సార్సీపీ నేత భూమన అసత్య ప్రచారం - చర్యలకు సిద్ధమైన టీటీడీ