All Set for Hyderabad Local Bodies MLC Election : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ ఎన్నికలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓ మైక్రో అబ్జర్వర్తో పాటు ఓ కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు సహాయకులతో ఓ బృందాన్ని నియమించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ పోలింగ్కు ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం : ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక కోసం 250 మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం 500 మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో ఉండనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదని విప్ కూడా ఉండదని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు వేయవద్దంటూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎన్నికల కమిషన్కూ నివేదిక పంపించినట్లు వివరించారు.
ఎన్నిక అనివార్యం : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు పోటీపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటింగ్లో సైతం పాల్గొనబోమని ప్రకటించింది. దీంతో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. మే 1న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం ముగియనుండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ సారి కూడా ఈ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది.
ఈ నెల 25న ఓట్ల లెక్కింపు : అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి ఎంఐఎంకు మొత్తం 49 మంది ఓట్లు ఉండగా బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. సంఖ్యా బలం లేకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయడమే లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. గెలుస్తామనే ధీమాతోనూ ఉంది. అటు పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో మొత్తం 14 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్కు 15 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 24 ఓట్లు ఉన్నాయి. ఎన్నికలో ఎంఐఎంకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మజ్లిస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు - నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి