Prathidwani: శరీరానికి శిరస్సు ఎంత ముఖ్యమో దేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని అంత కీలకం. బలమైన రాజధాని ఉంటే లక్షలాదిమందికి నీడనివ్వగలుగుతుంది. విద్యా, ఉపాధి అవకాశాలిస్తుంది. మిగతా రాష్ట్రాన్ని పోషించగలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అమరావతి రాజధానికి రూపకల్పన చేశారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో దేశంలోని తొలి ప్రణాళికబద్దమైన రాజధానిని మొదలుపెట్టారు.
అయితే దురదృష్టవశాత్తు తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని చిదిమేసే ప్రయత్నం చేసింది. ఆంధ్రులకు ఉజ్వల భవిష్యత్తును అందించేలా ప్రపంచశ్రేణి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని అడుగడుగునా జగన్ సర్కార్ కాటేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రం సహకారంతో రెట్టించిన కసితో చంద్రబాబు మళ్లీ అమరావతికి ప్రాణప్రతిష్ట చేశారు. మోదీ మే 2న పునః ప్రారంభోత్సవం చేయనున్నారు. అభివృద్ధి దిశగా అమరావతి పయనంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం.
మే 2న రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని పునః ప్రారంభం చేస్తున్నారు. మోడీ అమరావతి పర్యటనకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అమరావతిని రాజధాని కానివ్వకుండా 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయినా ధైర్యంగా, దెబ్బలు తింటూ కూడా రైతులు నిలబడ్డారు. వారి పోరాటం ఫలించింది అనుకోవచ్చా? ప్రధానమంత్రి అమరావతిలో ఏఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు?. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి. అవి కొనసాగి ఉంటే ఈపాటికి అమరావతి ఎలా ఉండేది? రాజధాని నిర్మాణంలో కేంద్ర సహకారం ఎలా ఉంది?.
ఇరువురు కలిసి పనిచేయటం వలన ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు? కూటమి ప్రభుత్వం ఏపీలో గెలిచాకా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కార్యకలాపాలు, వ్యాపారాలు పెరిగాయా?. తొలి ప్రణాళికబద్ద నగరంగా అమరావతి ఏ విధంగా అడుగులు వేస్తుంది? భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏ విధంగా రూపకల్పన చేస్తున్నారు? కొత్తరూపునిస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో జరగాల్సిన కార్యాచరణేంటి? అనే విషయాలపై రాజకీయ విశ్లేషకురాలు పి. వినీల, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేశ్లు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.