First ATM in Tuvalu : ప్రపంచంలో తొలి ఏటీఎం ప్రవేశపెట్టి ఇప్పటికి 6 దశాబ్దాలు కావస్తోంది. 1967లో లండన్లో మొదటి ATM ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో దేశాలకు విస్తరించింది. కానీ, ఇప్పటికీ ఒక్క ఏటీఎం కూడా లేని దేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. అవును, ఇప్పటి వరకూ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేని ఓ దేశంలో తాజాగా దాన్ని ఏర్పాటు చేశారు. మరి, ఆ దేశం ఏది? ఎక్కడుంది? ఇన్నాళ్లు ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
పసిఫిక్ సముద్ర జలాల్లో :
ఆ దేశం పేరు తువాలు (Tuvalu). ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న దీవి. ఈ దేశ జనాభా సుమారు 11,200. ఈ దేశ విస్తీర్ణం 10 చదరపు మైళ్లు మాత్రమే. ఆస్ట్రేలియా - హవాయి మధ్య ఉన్న తొమ్మిది చిన్న చిన్న ద్వీపాలతో కలిసి ఈ తువాలు ఏర్పడింది. ఇది చిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేట, కొబ్బరి ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడతారు.

ఏప్రిల్ 15వ తేదీన :
ఈ దేశంలో ఇప్పటి వరకు ఏటీఎం లేదు. ప్రపంచంలో మొదటి ఏటీఎం ప్రారంభమైన ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఏప్రిల్ 15వ తేదీన మొదటి ఏటీఎం ప్రారంభమైంది. ఈ ఏటీఎం తయారు చేయడానికి అవసరమైన సాయాన్ని, పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ "నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు" అందించింది.
ప్రారంభించిన ప్రధానమంత్రి! :
మన దేశంలో ఎక్కడైనా ఏటీఎం ఓపెన్ చేయాల్సి వస్తే ఎవరు చేస్తారు? ఆ బ్యాంకు సంబంధిత బ్రాంచి మేనేజరో, లేదంటే మరో ఇతర అధికారో ప్రారంభిస్తారు. కానీ, తువాలు దేశంలోని ఏటీఎం ప్రారంభించాడినికి ఏకంగా ప్రధాన మంత్రి హాజరయ్యారు! దేశంలోనే మొదటి ఏటీఎం కావడం వల్ల ప్రధాని "ఫెలెటి టెయో" స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తువాలు దేశ చరిత్రలోనే ఇది అద్భుతమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఇదొక గొప్ప విజయమని వక్తలు అన్నారు.

గ్లోబల్ వార్మింగ్ కోరల్లో :
ఏటీఎం ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న ఈ దేశం, నిత్యం భయంలోనే కాలం వెళ్లదీస్తోంది. ఎందుకంటే, గ్లోబల్ వార్మింగ్కు బలికాబోతున్న దేశాల్లో తువాలు అగ్రభాగాన ఉంది! ఈ దేశపు రాజధాని ఇప్పటికే దాదాపు 40 శాతం సముద్రంలో మునిగిపోయింది. చాలా వేగంగా ముంపునకు గురవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ శతాబ్దం చివరి నాటికే తువాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రంలో మునిగిపోయే తొలి ద్వీపం కూడా ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ దేశంగా :
భవిష్యత్తులో తమ ద్వీపం సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉండడంతో, భవిష్యత్తు ఏర్పాట్లపై తువాలు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మెటావర్స్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ముంపు ముప్పు వేగంగా పెరుగుతుండడంతో రెండేళ్ల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రకృతి అందాలు, ప్రజల జీవన విధానాన్ని పర్యాటకులకు మెటావర్స్ సాంకేతికత ద్వారా చూపించేలా ఏర్పాట్లు చేసుకుంది. సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసేలా ఈ డిజిటల్ డెసిషన్ తీసుకుంది.
అచ్చం మనిషిలాగే మాటలు, దగ్గడం కూడా- ఈ వింత కాకిని మీరు చూశారా?