ఘాటు ఘాటుగా "అల్లం చారు" - ఈ సీజన్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!
- ఇంటిల్లిపాదికీ ఎంతో మంచిది - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు

Published : August 31, 2025 at 4:02 PM IST
Tasty Allam Charu Recipe : వర్షాకాలంలో మారిన వాతావణం కారణంగా చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. దాంతో నోటికి ఏం తిందామన్నా రుచికరంగా అనిపించదు. అలాగే, మరికొందరు చల్లని వేళ ఊరించే కూరలెన్నున్నా, కమ్మగా చారుతో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారందరి కోసం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ రసం రెసిపీని తీసుకొచ్చాం. అదే, స్పైసీ అండ్ టేస్టీ "అల్లం చారు". ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ వేడివేడి అన్నంలో రోజూ తినే దానికంటే నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు! పిల్లలకు కూడా ఈ చారు చాలా బాగా నచ్చుతుంది. మరి, ఘాటు ఘాటుగా ఘుమాయించే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన పదార్థాలు :
- మూడు చెంచాలు - కందిపప్పు
- రెండు - కరివేపాకు రెబ్బలు
- పావుచెంచా - పసుపు
- ఒకట్రెండు - టమాటాలు
- చెంచా - మిరియాలు
- అంగుళం ముక్క - అల్లం
- ఆరు - వెల్లుల్లి రెబ్బలు
- చెంచా - జీలకర్ర
- అరచెంచా - ధనియాలు
- రెండు చెంచాలు - కొత్తిమీర తరుగు
- మూడు చెంచాలు - నిమ్మరసం
- రుచికి తగినంత - ఉప్పు
ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం రుచికి ఫిదా!

తయారీ విధానం :
- సింపుల్గా చేసుకునే ఈ చారు తయారీ కోసం అరగంట ముందుగా ఒక గిన్నెలో కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
- అరగంట తర్వాత బాగా నానిన కందిపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని పసుపు, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు విజిల్స్ పాటు ఉడికించుకోవాలి.
- పప్పు మిశ్రమం మెత్తగా ఉడికి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అందులో అరలీటర్ నీళ్లను పోసి కలిపి ఒకసారి మిశ్రమాన్ని మెత్తగా మెదుపుకోవాలి.
- ఆపై ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి వడకట్టి పలుచటి పప్పు నీళ్లని మాత్రమే తీసుకోవాలి.

- ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.
- అనంతరం చారు తయారీకి స్టవ్ మీద వడకట్టుకున్న పప్పు నీళ్లు ఉన్న గిన్నె పెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న మిరియాలు-అల్లం మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలపాలి.
- ఆపై లో టూ మీడియం ఫ్లేమ్లో ఆ మిశ్రమం ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని బాగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో నిమ్మరసం యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చారుకు తాలింపును సిద్ధం చేసుకోవాలి.
కమ్మని "పుదీనా టమాటా పచ్చడి" - పచ్చిమిర్చి స్పెషల్ - రైస్, టిఫెన్లకు చక్కటి జోడి!

తాలింపు కోసం :
- నూనె - ఒకట్రెండు చెంచాలు
- ఆవాలు - అరచెంచా
- మెంతులు - పావు చెంచా
- ఎండుమిర్చి - రెండు
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - రెండు రెబ్బలు

- ఇందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
- అవి లైట్గా వేగాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపును చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం మంచిగా వేగిన తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో నోరూరించే "అల్లం నిమ్మకాయ చారు" రెడీ అవుతుంది!
అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!

