Super Tasty Flaxseeds Parota: పరోటాలు చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా ఆలూ పరోటా అయితే ఇంకా ఇష్టంగా తింటారు. అయితే పరోటాలను మైదా పిండి ఉపయోగించి చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో డేంజర్. అందుకే హెల్త్కు మేలు చేసే అవిసె గింజలతో రుచికరమైన పరోటా చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అవిసె గింజలు డైరెక్ట్గా తినలేని వారు ఇలా పరోటాలుగా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.
కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరం చురుగ్గా కదలాలన్నా తగినంత ప్రొటీన్ అందాలి. ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందే ఆహారంలో అవిసెగింజలు కూడా ఒకటి. ఇవి కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను పెంచుతుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కొలెస్ట్రాల్ లెవల్స్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన అవిసె గింజలతో పరోటాలు ఎలా చేసుకోవాలంటే,
కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి - 2 కప్పులు
- ఉప్పు - సరిపడా
- నెయ్యి - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 4
- ధనియాలు - అర టేబుల్ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- సోంపు - అర టీస్పూన్
- అవిసె గింజలు - ముప్పావు కప్పు
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- అల్లం తరుగు - కొద్దిగా
- ఉల్లిపాయ - 1
- చాట్ మసాలా - 1 టీ స్పూన్
- గోంగూర పచ్చడి - ఒకటిన్నర టేబుల్స్పూన్లు

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి.
- నీళ్లు సరిపోయాయి అనుకున్న తర్వాత సాగదీస్తూ పిండిని సుమారు 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.
- పిండిని ఎంతసేపు వత్తుకుంటే పరోటాలు అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత సమాన ఉండలుగా చేసుకుని తడిక్లాత్ కప్పి ఓ 30 నిమిషాలు పక్కన ఉంచాలి.

- ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి సిమ్లో మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు అదే పాన్లో అవిసె గింజలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ గింజలు చిట్లేంతవరకు ఫ్రై చేయాలి.
- గింజలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- ధనియాల మిశ్రమం, అవిసె గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత విడివిడిగా మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇలా గ్రైండ్ చేసుకున్న ధనియాల, అవిసె గింజల పొడిని ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ సన్నని తరుగు, చాట్మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇలా మిక్స్ చేసుకున్న పొడిలో గోంగూర పచ్చడిని వేసి కలపాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని పక్కన ఉంచాలి.
- ఇప్పుడు ఓ గోధుమ పిండి ఉండను తీసుకుని చేతితో కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి. పిండి మధ్యలో అవిసె గింజల పొడి ఉంచి పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇలా ఉండలన్నింటిలో స్టఫ్పింగ్ పెట్టుకోవాలి.
- ఇప్పుడు చపాతీ పీట మీద పొడి పిండి వేసి స్టఫ్ట్ చేసిన ఓ ఉండను ఉంచి లైట్గా చేతితో వెడల్పుగా చేయాలి. ఆ తర్వాత అప్పడాల కర్రతో సమానంగా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి.

- స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడి చేయాలి. పెనం బాగా హీటెక్కిన తర్వాత తయారు చేసిన పరోటాను వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి.
- పరోటా ఓవైపు కాలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లె పెట్టి మరో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. రెండో వైపు కాలుతున్నప్పుడు పరోటా మీద, చుట్టూ నూనె అప్లై చేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె అప్లై చేసుకుంటూ పరోటాను కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పరోటాలన్నింటిని కాల్చుకోవాలి.
- ఇలా కాల్చుకున్న వాటిని ఓ ప్లేట్లోకి తీసుకుని పెరుగు లేదా ఏదైనా గ్రేవీతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అవిసెగింజల పరోటా రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పిండిని సాఫ్ట్గానే కలుపుకోవాలి. అలాగే ఎంత ఎక్కువ సేపు కలిపితే పరోటాలు అంత బాగా వస్తాయి.
- అవిసె గింజలను సిమ్లోనే మంచిగా వేయించాలి. లేదంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
- గోంగూర పచ్చడి బదులు మీకు నచ్చిన ఇతర రకాలు పచ్చళ్లు కూడా వాడుకోవచ్చు.
పాతకాలం నాటి " పాల పూరీలు" - కమ్మగా ఉండే వీటిని ఎన్ని తిన్నా బోర్ కొట్టదు!
కన్నడ స్పెషల్ "నుచ్చినుండే" - పేరు మాత్రమేకాదు, టేస్ట్ కూడా సరికొత్తగా అద్దిరిపోతుంది!