PM Surya Ghar Muft Bijli Yojana : రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికిపైగా డ్వాక్రా, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలున్నారు. అంచెలంచెలుగా వారందరికీ ఆదాయ మార్గం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నాయి. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళలకు ఈ అవకాశం దక్కనుంది.
కేంద్రం తీసుకువచ్చిన పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన కింద ప్రతి ఇంటినీ సోలార్ విద్యుత్ దిశగా అనుసంధానించే చర్యలు ఊపందుకున్నాయి. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ పైకప్పులు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 80 వేల మంది అంగీకరించారు. ఈ నేపథ్యంలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వల్ల కలిగే లబ్ధిపై 'సెర్ప్' అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు తీపి కబురు - వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా ఆదాయం కూడా లభించనుంది. ఇంట్లోకి అవసరమైన విద్యుత్ వాడుకోవడంతో పాటు మిగులు విద్యుత్ గ్రిడ్కు అందించి ఆదాయం పొందొచ్చు. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన కింద రానున్న రెండేళ్లలో (2027 మార్చి) సుమారు 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల (కి.వా) సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ లక్ష్యం చేరుకుంటే సుమారు 4 వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా.
అత్యధికంగా రూ.78వేల రాయితీ :
- 'పీఎం సూర్యఘర్ యోజన' పథకం రాయితీ గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
- ఈ పథకం ద్వారా గరిష్ఠంగా 3 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్రం రాయితీ ఇస్తుంది.
- రాయితీ మినహా మిగిలిన వ్యయాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణం అందించనున్నాయి.
- 3 రకాల సామర్థ్యం కలిగిన సోలార్ రూప్ టాప్స్ ఏర్పాటుకు రాయితీ లభించనుంది.
- 3కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానెళ్ల వ్యయం 1.95 లక్షలు కాగా 78 వేలు రాయితీ వస్తుంది.
- 2కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానెళ్ల వ్యయం 1.40 లక్షలు కాగా 60 వేలు రాయితీ వస్తుంది.
- రాష్ట్రంలో ప్రస్తుతం 2కిలో వాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించారు.
- 2 కిలోవాట్ల ప్యానెళ్ల ద్వార నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా ఇంటి అవసరాలకు పోను మిగులు విద్యుత్ గ్రిడ్కు వెళ్తుంది. యూనిట్కు రూ.2.09 చొప్పున ప్రతి నెలా ఆదాయం లభించనుంది.
- కిలోవాట్ సామర్థ్యం కలిగిన ప్యానెళ్ల వ్యయం 70వేల రూపాయలు కాగా 30 వేలు రాయితీ వస్తుంది.
- లబ్ధిదారుల ఇల్లు, విద్యుత్ వినియోగం ఆధారంగా ప్యానెల్ రకాన్ని ఎంచుకోవచ్చు.
- లబ్ధిదారు వాటా 10 శాతం పోను మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా 7శాతం వడ్డీపై రుణం ఇప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు.

దరఖాస్తు చేయడం ఇలా :
- ముందుగా జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కరెంటు బిల్, బ్యాంకు వివరాలు, చిరునామా నమోదు చేయాలి.
- వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి డిస్కంకు దరఖాస్తు సమర్పించాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న కంపెనీ ఎంచుకోవాలి. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవచ్చు.
- ప్యానెళ్ల ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయ్యాక ఫొటోలు అప్లోడ్ చేస్తే వాటి పరిశీలన తర్వాత డిస్కంలు స్మార్ట్ మీటర్ అందజేస్తాయి. ఆ తర్వాత 15 రోజుల్లో కేంద్రమిచ్చే రాయితీ సొమ్ము బ్యాంకు ఖాతాలో పడుతుంది.
- దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి సోలార్ ప్యానళ్లను వాడిన వారికే సబ్సిడీ అందుతుంది.
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ - క్లారిటీ ఇచ్చిన విద్యుత్ సంస్థలు