How to Make Soft Idli at Home: ఇడ్లీలు చాలా మంది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. లైట్గా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుండటంతో ఎక్కువ మంది వీటిని తినడానికే మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలోనే మెజార్టీ ఇళ్లల్లో ఇడ్లీలను ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఇంతవరకు బానే ఉన్నా వచ్చిన చిక్కంతా ఇడ్లీ తయారీలోనే ఉంది. ఎందుకంటే వీటిని పర్ఫెక్ట్గా తయారు చేయడం చాలా మందికి రాదు. గట్టిగా రావడం, సరిగ్గా ఉడకకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు పిండిని ప్రిపేర్ చేసే సమయంలో ఈ ఒక్కటీ కలిపితే పిండి బాగా పులిసి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా, అలా నోట్లే వేసుకోగానే ఇలా కరిగిపోయేలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేసి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
- మినప గుండ్లు - 1 కప్పు
- సగ్గుబియ్యం - పావు కప్పు
- ఇడ్లీ రవ్వ - రెండున్నర కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి మినప గుండ్లు, సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే చాలా మంది పప్పు ఎక్కువ నానితే పిండి అంత బాగుంటుందని అనుకుంటారు. కానీ పప్పు ఎక్కువసేపు నానితే అందులోని జిగురు పోయి ఇడ్లీలు గట్టిగా అవుతాయి. కాబట్టి 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది.
- మరో గిన్నెలోకి రవ్వను కూడా తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి దీనిని 5 గంటల సేపు నానబెట్టాలి.
- ఇక్కడి వరకూ అందరూ చేసేదే. ఇడ్లీలు మెత్తగా రావాలంటే వీటితో పాటు మరో పదార్థాన్ని కూడా నానబెట్టుకోవాలి. అదే సోయా బీన్స్. పప్పు, రవ్వతో పాటు ఓ గిన్నెలోకి ఓ టేబుల్ స్పూన్ సోయా బీన్స్ తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి.
- పప్పు, రవ్వ, సోయా బీన్స్ నానిన తర్వాత మరోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
- మిక్సీజార్లోకి నానబెట్టిన సోయా బీన్స్, మినప గుండ్లు మిశ్రమాన్ని వడకట్టి వేసుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి.
- ఇప్పుడు మినప పప్పు, ఇడ్లీ రవ్వను కలిపి ఓ 5 నిమిషాల పాటు చేతితో బీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి సుమారు 8 గంటల పాటు రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి.
- పిండి బాగా పులిసిన తర్వాత మూత తీసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో నీటిని మరిగించుకోవాలి.
- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కు నూనె లేదా నెయ్యి అప్లై చేసుకుని పిండిని వేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ను పాత్రలో పెట్టి మూత పెట్టి మీడియం టూ హై ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఓ 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని పల్లీ చట్నీ, కారం పొడితో సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు రెడీ. నచ్చితే ఓసారి ఇలా ట్రై చేయండి.
దోశ పిండితో సూపర్ సాఫ్ట్ "ఇడ్లీలు" - ఇలా చేసుకుంటే రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!
రేషన్ బియ్యంతో 'ఇడ్లీ రవ్వ' - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి!