Tasty and Healthy Semiya Curd Bath: "దద్దోజనం" - తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. పండగలు, పూజలు, వ్రతాల సమయంలో ఎక్కువ మంది దీనిని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుని తింటుంటారు. అయితే సాధారణంగా దద్దోజనం చేయాలంటే అన్నం వండి అందులో పెరుగు కలిపి పోపు పెడుతుంటారు. అయితే ఎప్పుడూ అన్నంతో కాకుండా ఓసారి సేమియాతో చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంటీ సేమియాతో దద్దోజనం అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. సేమియాతో ఎప్పుడూ పాయసం, పులిహోర, ఉప్మా కాకుండా ఇలా దద్దోజనం చేసుకోండి. ఎన్నడూ తినని రుచితో అద్దిరిపోతుంది. పైగా ప్రిపేర్ చేసుకోవడం చాలా సులభం. మరి లేట్ చేయకుండా ఈ సేమియా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- సేమియా - 1 కప్పు
- పెరుగు - 250ml
- నూనె - 2 టేబుల్స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - కొద్దిగా
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- కీర దోసకాయ - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - అర చెంచా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- దానిమ్మ గింజలు - కొన్ని

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సుమారు లీటర్ నీళ్లు పోసి వేడి చేయాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సేమియా వేసి జస్ట్ 1 నిమిషం ఉడికించి తీసేయాలి.
- ఇలా ఉడికించిన సేమియాను జల్లెడలో పోసి వడకట్టాలి. ఆపై వెంటనే చల్లని నీళ్లు పోసి వడకట్టి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు కీర దోసకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి సన్నగా తురుమి పక్కన ఉంచాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
- తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

- ఓ గిన్నెలోకి పెరుగు, కీర దోస తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆపై అందులోకి ఉడికించిన సేమ్యా వేసి మరోసారి కలపాలి.
- చివరగా తాలింపు మిశ్రమం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలు, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే సేమియా దద్దోజనం రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే సేమియా వేయాలి. అలాగే సేమియాను మరీ మెత్తగా ఉడికించకుండా కేవలం 80 శాతం ఉడికిస్తే సరిపోతుంది.
- తాజా పెరుగు అయితే దద్దోజనం రుచి బాగుంటుంది. పుల్లటి పెరుగు అస్సలు వాడొద్దు. అలాగే సేమియా ఎంత తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో పెరుగు తీసుకోవాలి.
- మిరియాల పొడిని అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి. ఒకవేళ అలా కుదరకపోతే తాలింపులో మిరియాలు వేసి ఫ్రై చేసుకోవచ్చు.
- కేవలం కీరదోస తురుము మాత్రమే కాకుండా క్యారెట్ తురుము కూడా కలుపుకోవచ్చు.

కమ్మని "మ్యాంగో పాయసం" - నిమిషాల్లో రెడీ - ఒక్కసారి తింటే జిందగీ ఫుల్ ఖుష్!