Rice Flour Mysore Bonda: మెజార్టీ పీపుల్ ఇష్టపడే టిఫెన్స్లో మైసూర్ బోండా ఒకటి. టిఫెన్ సెంటర్స్, హోటల్స్కి వెళ్లినప్పుడు వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. అయితే సాధారణంగా బోండాలు చేయాలంటే మెజార్టీ పీపుల్ మైదా వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రస్తుత కాలంలో కొద్దిమంది గోధుమపిండితో బోండాలు చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఈ పిండితో కాకుండా అందరి ఇళ్లలో లభించే బియ్యప్పిండితో బోండాలు వేసుకోండి. పర్ఫెక్ట్ షేప్ రావడంతో పాటు లోపల పిండి ఉడికి, గుల్లగా వస్తాయి. పైగా నూనె అస్సలు పీల్చవు. మరి లేట్ చేయకుండా బియ్యప్పిండి బోండాలు ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యప్పిండి - 1 కప్పు
- గోధుమపిండి - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- వంట సోడా - అర టీస్పూన్
- నూనె - 1 టేబుల్స్పూన్
- పెరుగు - 1 కప్పు
- జీలకర్ర - అర టీస్పూన్
- అల్లం తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి బియ్యప్పిండి, గోధుమపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి వంట సోడా, నూనె, పెరుగు వేసి కలుపుకోవాలి.
- అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది.
- పిండికి నీళ్లు సరిపడా పోసుకున్న తర్వాత ఆపకుండా ఓ 10 నిమిషాల పాటు పిండిని పై నుంచి కిందకు అనుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోండాలు గుల్లగా వస్తాయి.

- ఇలా కలిపిన పిండి గిన్నెపై మూత లేదా తడి క్లాత్ ఉంచి సుమారు 2 గంటలు పక్కన పెట్టాలి. ఒకవేళ మీరు ఉదయం చేయాలనుకుంటే రాత్రే ఈ పిండిని కలిపి పెట్టుకోవచ్చు. పిండి ఎంత ఎక్కువ సేపు నానితే మైసూర్ బోండా అంత టేస్టీగా, గుల్లగా వస్తాయి.
- పిండి బాగా నానిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి మరో 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత సిమ్లో పెట్టి చేతులు తడి చేసుకుంటూ పిండిని తీసుకుని బోండాలుగా వేసుకోవాలి. పిండి చేతులకు అంటుకుంటే ఇవి షేప్లో రావు. కాబట్టి చేతులు తడి చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి.
- ఇలా కడాయికి సరిపడా బోండాలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని బోండాలుగా వేసుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ బియ్యప్పిండి బోండాలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ బోండాలు చేసేందుకు పుల్లటి పెరుగు అయితే రుచి మరింత బాగుంటుంది.
- గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా కలుపుకోవచ్చు.
- పిండి ఎంత ఎక్కువ నానితే బోండాలు అంత గుల్లగా, నూనె పీల్చకుండా వస్తాయి. కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బోండాలు చేసుకోవచ్చు.
నోరూరించే "బీరకాయ టమాటా పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అదుర్స్ - నిమిషాల్లో రెడీ!
పిల్లలకు విపరీతంగా నచ్చే "మసాలా పూరీలు" - ఇలా చేస్తే పొంగడంతో పాటు నూనె పీల్చవు!