Peanut Chikki Making Process : మనలో చాలా మంది బెల్లంతో చేసిన "పల్లీ పట్టీలను" ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక పిల్లల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం, పల్లీలతో ప్రిపేర్ చేసే ఈ చిక్కీలలో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే, వీటిని తినాలనిపించినప్పుడు చాలా మంది బయట ప్యాకెట్స్ రూపంలో చిక్కీలను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఇంట్లో ట్రై చేస్తుంటారు.
కానీ, పాకం సరిగ్గా కుదరకపోవడమో, తింటుంటే పంటికి అతుక్కోవడమో జరుగుతుంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఓసారి ఈ కొలతలు, టిప్స్ ఫాలో అవుతూ పల్లీ పట్టీలను ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా సూపర్ టేస్టీగానూ వస్తాయి. తింటుంటే పంటికి అంటుకోకుండా అచ్చం స్వీట్ షాపులలో, ప్యాకెట్స్లో అమ్మే వాటిలా చక్కగా కుదురుతాయి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, అందుకు అవసరైన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- పల్లీలు - ఒకటిన్నర కప్పులు
- బెల్లం తురుము - ఒక కప్పు
- నెయ్యి - ఒక టీస్పూన్
- వంటసోడా - పావు చెంచా
నెయ్యి లేకుండా మూడే మూడు పదార్థాలతో కమ్మని "మైసూర్ పాక్" - కేవలం అరగంటలో రెడీ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ వేసి బౌల్ మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం పావు గంటపైనే టైమ్ పడుతుంది.
- పల్లీలు ఎంత బాగి వేగితే చిక్కీ అంత రుచికరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- వేరుశనగగుండ్లు బాగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారాక పొట్టు తీసుకొని బద్దలుగా చేసి పక్కనుంచాలి.
- అనంతరం అదే పాన్లో బెల్లం వేసి మరిగించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. కాసేపటికి అంటే నాలుగైదు నిమిషాలకు బెల్లం కాస్త కరిగి జిగురు పాకంలా మారుతుంది.
- ఆ తర్వాత మరికాసేపటికి బెల్లం పూర్తిగా కరిగి బాగా జారుగా అవుతుంది.
- బెల్లాన్ని ఆవిధంగా కరిగించుకున్నాక అందులో నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. బెల్లం బాగా కరిగి బంగారు రంగులో ముదురు పాకం అవుతుంది.
- అలాంటి పాకం వచ్చిందని తెలుసుకునేందుకు ఓ చిట్కా. అదేంటంటే, కొద్దిగా పాకాన్ని తీసుకుని ఒక చిన్న గిన్నెలో ఉన్న చల్లటి నీళ్లలో వేసి నాలుగైదు సెకన్లు వెయిట్ చేయాలి. ఆ తర్వాత పాకాన్ని నీటిలో నుంచి తీసి తుంచితే అప్పడాలలాగా విరిగిపోవాలి.
- ఈవిధంగా పాకం వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ పాకం. అలాకాకుండా పాకం ముద్దగా సాగుతుంటే మాత్రం మరికాసేపు పాకం మరిగించాలని గుర్తుంచుకోవాలి.
పెసరపప్పుతో కమ్మనైన "ధారాక్షి స్వీట్" - పైన కరకర, లోపల జ్యూసీగా!

- పర్ఫెక్ట్ పాకం సిద్ధమయ్యాక అందులో వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు బద్దలుగా చేసుకొని పక్కనుంచిన వేయించిన పల్లీలను వేసి గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- పాకం పల్లీలకు బాగా పట్టగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి.
- ఆ తర్వాత వెంటనే దాన్ని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న అల్యూమినియం ఫాయిల్ పరచిన గిన్నెలో వేసుకొని నెయ్యి రాసిన చెంచాతో మొత్తం సమానంగా సర్దుకోవాలి (ఇక్కడ సిల్వర్ ఫాయిల్ లేని వారు నెయ్యి రాసిన ప్లేట్ వాడుకోవచ్చు.)
- అనంతరం ఫాయిల్ను బయటకు తీసి ఒక ప్లేట్లో ఉంచండి. ఆపై నెయ్యి రాసిన చపాతీ కర్రను ఉపయోగించి మొత్తం సమానంగా రోల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కత్తితో మీకు కావాల్సిన పరిమాణంలో గాట్లు పెట్టుకోవాలి.
- అనంతరం కట్ చేసుకున్న వాటిని మూడు గంటల పాటు గాలికి అలా వదిలేయాలి.
- మూడు గంటల తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఇలా తీసేస్తే అలా వచ్చేస్తుంది. ఆపై తుంచితే మీరు కత్తితో పెట్టుకున్న షేప్లో పర్ఫెక్ట్గా కట్ అవుతాయి. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రంచీ "పల్లీ పట్టీలు లేదా చిక్కీలు" రెడీ!

ఈ టిప్స్తో పర్ఫెక్ట్ టేస్ట్ :
- పల్లీలను వీలైనంత వరకు తక్కువ మంట మీదనే వేయించుకోవాలి. అప్పుడే గింజల లోపలి వరకు క్రిస్పీగా, క్రంచీగా వేగుతాయి.
- బెల్లాన్ని కరిగించుకునే క్రమంలో చుక్క నీరు యాడ్ చేసుకోవాల్సిన పనిలేదు.
- ఇక్కడ బెల్లాన్ని గడ్డలుగా కాకుండా తురుముగా వేసుకుంటే పని సులువవుతుందని గుర్తుంచుకోవాలి.
- నెయ్యి వేసుకోవడం ద్వారా చిక్కీకి మంచి మెరుపుతో పాటు రుచి కూడా వస్తుంది.
- అలాగే, వంటసోడా వేయడం ద్వారా చిక్కీలు మరింత క్రంచీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. రోజుల తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటుంది చిక్కీ.
- అల్యూమినియం ఫాయిల్ పరచిన గిన్నెలో చిక్కీ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అలాగే, చల్లారిన తర్వాత బయటకు తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది.
బొప్పాయిని నేరుగా తినడమే కాదు - ఇలా "లడ్డూలు" చేసుకోండి! - ఒకటి తింటే వాటి ప్రేమలో పడిపోవాల్సిందే!