Andhra Special Pala Puri Recipe : మనలో చాలా మంది ఫెవరేట్ రెసిపీల్లో ఒకటి పూరీలు. పిల్లల నుంచి పెద్దల వరకు వీటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే, ఎప్పుడూ నార్మల్గా చేసే పూరీలు తినాలంటే ఎవరికైనా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే, ఈసారి పూరీలతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ చేసుకోండి. అదే, ఆంధ్రా స్పెషల్ "పాల పూరీలు". ఇది పాతకాలపు బహు గొప్ప వంటకం. కానీ, ఎప్పుడో మరచిపోయిన ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పూరీలు సూపర్ టేస్టీగా ఉండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. అమృతం ఎలా ఉంటుందో తేలీదు గానీ వీటిని తింటుంటే అలాంటి అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. పిల్లలైతే వీటిని అడిగి మరీ తింటారు. పైగా ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మరి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పూరీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- గోధుమ పిండి - ఒక కప్పు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు
- గసగసాలు - రెండు టేబుల్స్పూన్లు
- బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
- జీడిపప్పు పలుకులు - పిడికెడు
- పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
- పాలు - తగినన్ని
- పంచదార - ముప్పావు కప్పు
- యాలకుల పొడి - ఒకటీస్పూన్
- నూనె - వేయించడానికి సరిపడా
పిల్లలు స్వీట్ అడిగితే - ఇలా "తియ్యటి పూరీలు" చేసి పెట్టండి! - కనీసం 15 రోజులు నిల్వ!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకొని అరగంట పాటు పక్కనుంచాలి.
- ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో గసగసాలు, బియ్యప్పిండి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ పొడిలో జీడిపప్పు పలుకులు వేసి ఎక్కడా చిన్న పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే మిశ్రమంలో సన్నని పచ్చికొబ్బరి తురుము వేసుకొని తగినన్ని పాలను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా రవ్వ అనేది ఉండకుండా చూసుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద కచ్చితంగా అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకొని వెన్నలా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పచ్చికొబ్బరి మిశ్రమం వేసుకోవాలి.
- ఆపై అందులో ఒక లీటర్ చిక్కని పాలను పోసి కలుపుతూ లో ఫ్లేమ్ మీద పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇందుకోసం కనీసం ఇరవై నిమిషాల పైనే సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.
- పాలు బాగా మరిగి కాస్త చిక్కబడ్డాక అందులో పంచదార, యాలకుల పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు సన్నని సెగ మీద కలుపుతూ మరిగించుకోవాలి.
- ఆ మిశ్రమం సాంబార్లా చిక్కగా మారిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ని దింపి పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు తడిపి ఉంచుకున్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- తర్వాత చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒక్కో పిండి ఉండను చపాతీ కర్రతో రౌండ్గా, పల్చని పూరీల మాదిరిగా వత్తుకోవాలి.
- ఆపై ఒక్కో పూరీపై ఫోర్క్ చెంచాతో అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా పూరీ పొంగదు.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసి అప్పడాల మాదిరిగా ఎర్రగా, క్రిస్పీగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.

- ఇప్పుడు పూర్తిగా చల్లారిన పూరీలను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో వేసి 15 సెకన్ల పాటు అవి మునిగేలా ఉంచి బయటకు తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచి అవి మెత్తబడిపోయి తినేటప్పుడు చిదురు అయిపోతాయి.
- అనంతరం వాటిని ఒక ప్లేట్లోకి 30 సెకన్లు ఉంచి సర్వ్ చేసుకున్నారంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని ఆంధ్రా స్పెషల్ "పాల పూరీలు" మీ ముందు ఉంటాయి!
- ఆపై వీటి మీద కాస్త పాల మిక్చర్ పోసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది!

టిప్స్ :
- పచ్చికొబ్బరి మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవడంలోనే పాల పూరీల రుచి ఆధారపడి ఉంటుంది. ఎక్కడా రవ్వ లాంటిది లేకుండా వెన్నలా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి.
- ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న పాల మిక్చర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే రెండు మూడు రోజుల పాటు ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలను చేసుకొని దానితో ఈ రెసిపీని చేసుకొని ఆరగించవచ్చు.
మైదా పూరీకి బ్రేకప్ చెప్పండి - "టమాటా పూరీ"తో ప్యార్ మే పడిపోండి! - నూనె పీల్చవు, సూపర్ టేస్టీగా!
బియ్యం, బెల్లంతో అరిసెలను తలదన్నే "స్వీట్" - పాకం లేకుండానే ఈజీగా చేసుకోండిలా!