Simple Steps to Make Crispy Janthikalu : పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు. అలాంటి టైమ్లో చాలా మంది బయట నుంచి కొని తెచ్చిస్తుంటారు. మరికొందరేమో ఇంట్లోనే రకరకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఎక్కువ మంది జంతికలు, చెక్కలు, కారపూస వంటి పిండి వంటకాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు జంతికలు ఎంత బాగా చేసినా క్రిస్పీగా, గుల్లగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఇలా పిండి కలిపి మినప జంతికలు చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా ఎంతో రుచికరంగా వస్తాయి. అంతేకాదు, మినపప్పులో ఉండే పోషకాలు పిల్లలకు మంచి బలాన్నిస్తాయి! పైగా ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి! మరి, ఈ కరకరలాడే కమ్మని మురుకులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- ఇక్కడ కొలతల కోసం మినపప్పు తీసుకున్న కప్పునే వాటర్, బియ్యప్పిండిని తీసుకోవడానికి యూజ్ చేయాలి. అప్పుడే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి.
- ఈ రెసిపీలో మీకు వాము వేసుకోవడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో జీలకర్రని అయినా తీసుకోవచ్చు.
- పిండిలో 'బటర్' వేసి కలుపుకోవడం ద్వారా జంతికలు గుల్లగా, క్రిస్పీగా రావడానికి సహాయపడుతుంది.
- పిండిని జారుడుగా, మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకుండా కలుపుకోవాలి. ఎందుకంటే అలా ఉంటే నూనె ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది.
- అలాగే, ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే జంతికలను వేసి వేయించుకోవాలి. లేదంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- మినపప్పు - ఒక కప్పు(120 గ్రాములు)
- బియ్యప్పిండి - నాలుగు కప్పులు(350 గ్రాములు)
- వాము - 2 టేబుల్స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- తెల్లని నువ్వులు - మూడు టేబుల్స్పూన్లు
- బటర్ - రెండు టేబుల్స్పూన్లు
- పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టేబుల్స్పూన్
- నూనె - వేయించడానికి తగినంత
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికల కోసం ముందుగా కుక్కర్లో నాణ్యమైన మినపప్పుని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో మూడు కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- మినపప్పు చక్కగా నానిన తర్వాత కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- పప్పుని మంచిగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన మినపప్పుని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

- తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్లో పొడి బియ్యప్పిండిని తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, వాముని చేతితో నలిపి వేసుకోవాలి.
- అలాగే, తెల్ల నువ్వులు, బటర్ వేసుకొని అది పిండికి పట్టేలా మిశ్రమం మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత జంతికలు కాస్త కారంగా ఉండడానికి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి.
- అనంతరం ముందుగా మిక్సీ పట్టి పక్కనుంచిన మినపప్పు పేస్ట్ని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపాలి.
- ఆపై కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా, గట్టిగా కాకుండా జంతికలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యే లోపు జంతికల గొట్టం తీసుకొని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో ఉండే జంతికల అచ్చును గొట్టానికి అమర్చుకోవాలి.

- అనంతరం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకొని జంతికల మౌల్డ్లో పెట్టుకోవాలి.
- తర్వాత నూనె రాసిన ప్లేట్ లేదా గరిటెపై జంతికలను గుండ్రంగా లేదా మీకు కావలసిన ఆకారంలో వత్తుకోవాలి.
- ఆపై కడాయిలో కాగుతున్న నూనె వేడెక్కిందో లేదో చిన్న పిండి ముక్క వేసి చూసుకోవాలి. అది వెంటనే పైకి వస్తే ఆయిల్ సరిగ్గా వేడెక్కినట్లుగా తెలుసుకోవాలి.
- అప్పుడు మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జంతికలను కాగుతున్న నూనెలో కడాయిలో సరిపడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి.
- అనంతరం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి జంతికలను రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్లోకి తీసుకోవాలి. కాసేపు ఆగి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా కరకరలాడే "మినప మురుకులు" మీ ముందు ఉంటాయి!
- నార్మల్గా బియ్యప్పిండి జంతికల మాదిరిగా ఇవి ఎర్రగా వేగవు. కాబట్టి, కొంచం క్రీమ్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి.
- ఆపై వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. కనీసం 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి!