IRCTC Summer Packages : వేసవిలో ఎక్కువ మంది పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఎండల తీవ్రత నేపథ్యంలో చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అందుకే IRCTC పలు టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే చల్లని ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే వీలుంది. అవేంటో చూద్దాం.
తిరుపతిలో శ్రీవారి దర్శనం కావాలా? - IRCTC స్పెషల్ ప్యాకేజీ - గదులు సైతం!
కళాశాలలకు వేసవి సెలవులు ఇప్పటికే ప్రకటించగా మరికొద్ది రోజుల్లో స్కూళ్లు సైతం మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో చాలా మంది గుళ్లు, చారిత్రక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను దర్శించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీలను రూపొందించింది. కేరళ, గోవా సహా ఎక్కడికైనా సరే వెళ్లేలా టూర్ ప్లాన్ చేసింది. ఆ వివరాలివీ.
కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ప్యాకేజీ : కేరళలోని అలెప్పీ, మున్నార్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ప్రస్తుతం ఈ సీజన్లో అక్కడికి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ టు కేరళ టూర్ ప్యాకేజీ ఎంచుకోవచ్చు. కేరళ హిల్స్ అండ్ వాటర్ (KERALA HILLS & WATERS) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ప్యాకేజీ కావాల్సిన వారు ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది.
కర్ణాటక టూర్ ప్యాకేజీ : కర్ణాటక తీర ప్రాంతంలోని పశ్చిమ కనుమలు సహా పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ లో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ఆలయాలను చూడొచ్చు. కోస్టర్ కర్ణాటక (COASTAL KARNATAKA) పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ప్యాకేజీ కావాల్సిన వారు ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి బుక్ చేసుకోవచ్చు. ఒక వేళ ఈ తేదీలో వెళ్లలేని వారు మరో తేదీని బుక్ చేసుకునే వీలుంది.
వండర్స్ ఆఫ్ వయనాడ్ : ప్రకృతి అందాలకు కేరళ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది. పచ్చని కొండలు, కాఫీ తోటలు చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మొచ్చు. ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అనే పేరున్న కేరళలో వయనాడ్లోని పలు ప్రదేశాలను చూసేందుకు IRCTC ప్యాకేజీని ప్రకటించింది. వండర్స్ ఆఫ్ వయనాడ్ (WONDERS OF WAYANAD) పేరుతో కొనసాగే ఈ టూర్ 6 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఊటీ టూర్ ప్యాకేజీ : తమిళనాడు రాష్ట్రంలోనూ ఊటీ దక్షిణ భారతదేశంలో శీతల ప్రదేశం. అందుకే వేసవిలో ఊటీ వెళ్లేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఊటీతో పాటు కున్నూర్ వంటి ప్రాంతాలను కూడా సందర్శించేలా ULTIMATE OOTY EX HYDERABAD పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఊటీ టూర్ ప్యాకేజీ సైతం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈస్ట్ కోస్ట్ టూర్ ప్యాకేజీ : ఈ ప్యాకేజీలో భాగంగా తూర్పు కోస్తా తీర ప్రాంతంలో అతి ముఖ్యమైన విశాఖతో పాటు అరకు, బొర్రా గుహలను తిలకించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3నుంచి అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు IRCTC టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి JEWEL OF EAST COAST పేరుతో ఉండే ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి.
IRCTC టూర్ ప్యాకేజీలు కేవలం రైలు ప్రయాణమే గాకుండా పలు ప్రాంతాల్లో రోడ్డు మార్గాల ద్వారా అందుబాటులో ఉంటాయి. పెద్దలు, పిల్లలు, ఏసీ, నాన్ ఏసీ ఆధారంగా ప్యాకేజీ ధరలు ఉంటాయి.
గురువారం "షిర్డీ సాయి"ని దర్శించుకోవాలనుకుంటున్నారా? - IRCTC ఈ ప్యాకేజీ మీ కోసమే!
"అమృత్ భారత్"తో రూపురేఖలు మారనున్న రైల్వేస్టేషన్లు - మీ ఊరు ఎంపికైందో లేదో చెక్ చేసుకోండి!