Instant Mysore Bonda at Home : మెజార్టీ పీపుల్ ఇష్టపడే టిఫెన్స్లో మైసూర్ బోండా ఒకటి. టిఫెన్ సెంటర్స్, హోటల్స్కి వెళ్లినప్పుడు వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. అయితే సాధారణంగా బోండాలు చేయాలంటే పిండిని కలిపి సుమారు కొన్ని గంటల పాటు పులియబెట్టాలి. అప్పుడు పిండి బాగా నాని బోండాలు సాఫ్ట్గా, గుల్లగా వస్తాయి. కానీ ఇలా గంటలపాటు వెయిట్ చేయాల్సిన పనిలేకుండా కేవలం 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టి బోండాలు వేసుకోవచ్చు. పైగా ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల గుల్లగా వస్తాయి. పిండి కూడా కరెక్ట్గా ఉడుకుతుంది. అయితే ఇలా రావాలంటే మాత్రం కరెక్ట్ కొలతలు, టిప్స్ పాటించాలి. . మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పంచదార - 1 టీస్పూన్
- నూనె - 2 టేబుల్స్పూన్లు
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మైదా పిండి - 1 కప్పు
- గోధుమపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - 2 టేబుల్స్పూన్లు

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి పెరుగు, ఉప్పు, పంచదార, నూనె వేసి విస్కర్ సాయంతో ఉండలు లేకుండా పెరుగు క్రిమీగా మారే వరకు బీట్ చేసుకోవాలి.
- పెరుగు స్మూత్గా అయిన తర్వాత బేకింగ్ సోడా, జీలకర్ర వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల బోండాలు గుల్లగా వస్తాయి.
- పెరుగుపై బబుల్స్ వచ్చినప్పుడు మైదా పిండి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.

- పిండిలన్నీ పెరుగులోకి కలిసిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి లూజ్గా మారితే సరైన షేప్లో బోండాలు రావు. అదే గట్టిగా అయితే లోపల పిండి ఉడకదు. కాబట్టి నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని సరైన విధంగా కలుపుకోవాలి.
- నీళ్లు సరిపడా పోసుకున్న తర్వాత ఆపకుండా సుమారు 10 నిమిషాల పాటు పిండిని చేతితో పై నుంచి కిందకు అనుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోండా లోపల పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది.

- ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ పిండిని గంటలపాటు పులియబెట్టాల్సిన పనిలేదు.
- 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరో 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను సిమ్లో పెట్టి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాలుగా వేయాలి.

- కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జల్లి గరిటెతో రౌండ్గా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి.
- ఇలా కాల్చుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్ట్స్రా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని బోండాలుగా వేసుకుని కాల్చుకోవాలి.
- ఇలా చేసుకున్న వాటిని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల గుల్లగా ఇన్స్టంట్ మైసూర్ బోండా రెడీ. నచ్చితే ఈసారి ఈ పద్ధతిలో చేయండి, పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.

టిప్స్:
- మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే అన్నింటిని సరైన కొలతల ప్రకారం తీసుకోవాలి. అంటే 1 కప్పు పెరుగుకు, రెండు కప్పుల పిండి. అలాగే రెండు కప్పుల పిండికి, 2 టేబుల్స్పూన్ల బియ్యప్పిండి. అంటే ఒక కప్పు పిండికి 1 టేబుల్స్పూన్ బియ్యప్పిండి.
- మైదా, గోధుమ పిండి ఇలా రెండూ కాకుండా మొత్తంగా మైదా లేదా గోధుమపిండితో కూడా బోండాలు వేసుకోవచ్చు.
- బోండాలు గుండ్రంగా రావాలంటే పిండిని తీసుకుని చేతిని రివర్స్ తిప్పి బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి పిండి నూనెలో జారేలా వేసుకోవాలి.
- పిండిని కలపడానికి చాలా మంది చల్లటి నీళ్లు పోస్తుంటారు. కానీ బోండాల పిండిని కలపడానికి వేడినీళ్లు యూజ్ చేయడం వల్ల పిండి త్వరగా పులిసి రౌండ్ షేప్లో వస్తాయి.
- బోండాలు పర్ఫెక్ట్గా కాలాలంటే నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడే పిండిని వేయగానే వెంటనే పైకి తేలి లోపల మంచిగా ఉడకటంతో పాటు రౌండ్గా వస్తాయి. లేదంటే పిండి అడుగున చేరి నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది.
నీచు వాసన లేకుండా "చికెన్ ఫ్రై" - ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు! - అన్నింటిలోకి అదుర్స్!
కమ్మని "ఆవకాయ పెరుగన్నం తాలింపు" - 5 నిమిషాల్లో రెడీ - టేస్ట్ వేరే లెవల్!