Rice Poori : ఇంట్లో మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారా? చాలా మంది చద్దన్నం వడలు, దోసెల్లో కలిపి వాడేస్తుంటారు. అయితే, మిగిలిపోయిన అన్నంతో పూరీలు కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును! మిగిలిపోయిన లేదా అప్పుడే ఉడికించిన అన్నంతో పూరీలు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పచ్చిమిర్చి, జీలకర్ర కూడా కలిపి చేసుకోవడం వల్ల ఎంతో బాగుంటాయి.
ఘుమఘుమలాడే "మటన్ గ్రేవీ కర్రీ" - ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, త్వరగా ఉడికిపోతుంది!
పూరీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు. కొంత మంది మైదాతో మరికొందరు గోధుమ పిండితో, ఇంకొందరు రవ్వతో పూరీలు చేస్తుంటారు. నూనెలో కాల్చడం వల్ల ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇవాళ మిగిలిపోయిన లేదా అప్పుడే ఉడికించిన అన్నం కలిపి పూరీలు ఎలా చేయాలో తెలుసుకుందాం!

పూరీ పిండిలోకి కావాల్సిన పదార్థాలు
- అన్నం - కప్పు
- పచ్చిమిర్చి - 2
- జీలకర్ర - 1 స్పూన్
- నీళ్లు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - పావు టీ స్పూన్
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- గోధుమ పిండి - కప్పు
చట్నీ కోసం
- పచ్చి కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- మిర్చి - 6
- జీలకర్ర - 1 స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 6
- అల్లం - ఇంచు
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - కొద్దిగా వేసుకుని
- పుట్నాల పప్పు - 1 టేబుల్ స్పూన్ వేసుకుని
పోపు కోసం
- మినప్పపు - అర టీ స్పూన్
- జీలకర్ర - పావు టీ స్పూన్
- ఆవాలు - పావు టీ స్పూన్
- ఎండు మిర్చి - 1
- కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
- అప్పుడే ఉడికించిన లేదా మిగిలిపోయిన అన్నం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ అన్నం పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నువ్వులు కూడా వేసుకోవాలి.
- ఇపుడు గోధుమ పిండిని కొద్దికొద్దిగా అన్నం మిశ్రమంలో కలుపుకోవాలి. మధ్య మధ్యలో నూన పోసుకుంటూ కలపడం వల్ల పిండి చక్కగా కలిసిపోవడంతో పాటు పూరీలు పొంగుతాయి. ఇలా బాగా కలుపుకున్న పిండిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఈ లోగా చట్నీ కోసం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, నీళ్లు, పుట్నాల పప్పు వేసుకుని రుబ్బుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం చిన్న కడాయిలో నూనె పోసుకుని వేడయ్యాక మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసుకుని చిటపటలాడించి కొద్దిగా ఇంగువ వేసుకుని దించుకోవాలి. పోపును చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది.
- ఈ లోగా పూరీ పిండి మృదువుగా మారుతుంది. మరో సారి 3 నిమిషాల పాటు బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పూరీల్లాగా వత్తుకోవాలి. అన్నీ రెడీ చేసుకుని ఈ లోగా కడాయిలో నూనె పోసుకుని బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసుకుంటే బూరెల్లాగా పొంగుతాయి. రెండు వైపులా కాల్చుకుని చట్నీలో తినేయడమే!.
- కొంతమంది ఉడికించిన లేదా మిగిలిపోయిన అన్నం మళ్లీ వేడిచేయడానికి ఇష్టపడరు. ఈ రెసిపీ మీకు నచ్చితేనే చేసుకోండి!
జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఇలా "జొన్న బన్ దోసెలు" వేసుకోండి - "షుగర్ పేషెంట్లకూ మంచిదే"
మైదా లేకుండా "ఉల్లిపాయ పరోటాలు" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!