PHOOL MAKHANA PAYASAM RECIPE : బెల్లం, పాలు, పూల్ మఖానా, సగ్గుబియ్యంతో చేసే ఈ పాయసం ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. పూజల్లో దేవుళ్లకు నైవేద్యంగానూ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వేసవిలో టీ, కాఫీలకు బదులుగా ఇదొక్క కప్పు తీసుకుంటే చాలు! పొట్టకు హాయిగా ఉండడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
శరీరానికి శక్తినిచ్చే "మల్టీగ్రెయిన్ జావ" - అప్పటికప్పుడు 10నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు
ఈ టిప్స్ పాటించండి :
- టేస్ట్ కోసం చిక్కని గేదె పాలు, ఫుల్ ప్యాట్ పాలు బాగుంటాయి.
- ఒక వేళ బెల్లం బదులు చక్కెర కావాలనుకుంటే బాదాం పొడి వేసుకున్న సమయంలోనే చక్కెర వేసుకోవాలి.
- పాయసం పలుచగా కావాలనుకుంటే పాలు ఎక్కువగా తీసుకోవాలి. లేదా కొన్ని నీళ్లు కలుపుకున్నా చాలు.

కావల్సిన పదార్థాలు
- సగ్గు బియ్యం - అర కప్పు
- బెల్లం - అరకప్పు
- నీళ్లు - పావు కప్పు
- నెయ్యి - 1 టీ స్పూన్
- పూల్ మఖానా - 1 కప్పు
- పాలు - 750 ఎం.ఎల్.
- కుంకుమ పువ్వు - కొద్దిగా
- బాదం - 12
- పిస్తా లేదా జీడిపప్పు - 10
- యాలకులు - 4

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్లో సగ్గు బియ్యం నీళ్లలో నానబెట్టుకోవాలి. రెండు గంటలు నీళ్లలో నానబెట్టుకుంటే ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగానే నానబెట్టడం వల్ల నిమిషాల వ్యవధిలో పాయసం చేసుకోవచ్చు. మరో వైపు అరకప్పు బెల్లం తురుము కడాయిలో వేసుకుని పావు కప్పు నీళ్లు పోసుకుని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా ఒక నిమిషం పాటు మరిగిస్తే చాలు.
ఇపుడు కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసి పూల్ మఖానా వేసుకోవాలి. సన్నటి మంటపై మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో పాలు పోసుకుని వేడిచేసుకోవాలి. ఇవి ఒకసారి పొంగు వస్తే సరిపోతుంది. ఇపుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. ఈ సమయంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని కలుపుకోవాలి. పాలు మరుగుతున్నపుడు బాదం, పిస్తా లేదా జీడిపప్పు, నాలుగైదు యాలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాయసం రుచి చాలా బాగుంటుంది.
సగ్గుబియ్యం సరిగ్గా ఉడికాయో లేదో చెక్ చేసుకుని మిక్సీ పట్టుకున్న బాదం పొడిని పాలలో వేసుకుని పూర్తిగా కలిసేలా గరిటెతో కలపాలి. లేదంటే బాదం పొడి ముద్ద కడుతుంది. ఒక వేళ బాదం పొడి ముద్ద కడుతుందనుకుంటే ముందుగానే కొద్దిగా నీళ్లలో కలుపుకుని పాలల్లో పోసుకుంటే చాలు. ఎక్కువ సేపు కాకుండా కొద్దిగా ఉడికిస్తే పాలు చిక్కబడి క్రీమీగా మారిపోతాయి. చివరగా సన్నగా తరిగిన బాదం పప్పు ముక్కలు, ఫ్రై చేసిన పూల్ మఖానా వేసుకోవాలి.
పూల్ మఖానా వేసుకున్నాక ఉడికించాల్సిన పని లేదు. అవి ఆ వేడికే ఉడికిపోతాయి. ఇపుడు దించి పక్కన పెట్టుకున్న పాయసంలోకి బెల్లం పాకం వడగట్టి పోసుకోవాలి. మరీ చిక్కగా అనిపిస్తే నీళ్లు పోసి కలుపుకుంటే సరిపోతుంది. ఈ పాయసం చల్లారిన తర్వాత ఎంతో రుచిగా ఉంటుంది.
చల్లచల్లని "బాదాం షేక్" - వ్యాపారులు అమ్మే బాదం పాల రెసిపీ సీక్రెట్ ఇదే!
శరీరాన్ని చల్లబరిచే "జిగర్తాండ" - ఈ మధురై రెసిపీ గొంతు దిగుతుంటే అమృతమే!