Kandipappu Garelu in Telugu : చాలా మందికి సాయంత్రం వేళ వేడివేడిగా పకోడీ, గారెలు, మిర్చీ బజ్జీలు తినాలనిపిస్తుంది. కొందరు కరకరలాడే గారెలు ఇష్టంగా తింటారు. సాధారణంగా పెసర్లు, మినప్పప్పు, శనగపప్పుతో గారెలు చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా కందిపప్పుతో గారెలు చేసుకుని తిన్నారా? ఈ కందిపప్పు గారెలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా కందిపప్పు గారెలు ఇష్టంగా తింటారు. మరి ఈ కందిపప్పు గారెలు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
- కందిపప్పు - 2 కప్పులు
- ఉల్లిపాయ తరుగు - అరకప్పు
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - తగినంత

తయారీ విధానం :
- ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి నీటిలో ఒక రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం కందిపప్పు నీళ్లు లేకుండా జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై కందిపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
- ఇప్పుడు కందిపప్పు మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, టీస్పూన్ జీలకర్ర, టీస్పూన్ గరం మసాలా, అరకప్పు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అరటీస్పూన్ పసుపు, టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోండి. (గారెలు కారంగా ఉండాలనుకునే వారు టీస్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు.)
- కందిపప్పు గారెలు కోసం పిండి కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే గారెలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
- చివరిగా పిండిలో ఒక స్పూన్ నూనె వేసి మరోసారి అన్ని పదార్థాలను కలుపుకోవాలి.
- పిండి రెడీ అయిన తర్వాత గారెలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్పై కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి వేడిచేసుకోవాలి.
- ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని పిండి కొంచెం కొంచెం తీసుకుని గారెల మాదిరిగా తయారు చేసుకుని వేడివేడి నూనెలో వేసుకోవాలి.
- ఇలా ఐదారు గారెలు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించి గరిటెతో రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి.
- చక్కగా ఎర్రగా కాలిన కందిపప్పు గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే మిగిలిన పిండితో సింపుల్గా ఇలా క్రిస్పీగా గారెలు చేసుకోండి.
- ఈ కందిపప్పు గారెలు ఈవెనింగ్ టైమ్లో బెస్ట్ స్నాక్! పిల్లలు, పెద్దలందరూ ఈ కందిపప్పు గారెలు ఇష్టంగా తింటారు. ఈ గారెల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
గోధుమపిండిలో సగ్గు బియ్యం కలిపి ఇలా చేయండి - పూరీలు పొంగుతుంటే మిమ్మల్నిమీరు నమ్మలేరు!
"ఇన్స్టెంట్ రవ్వ గుంత పొంగనాలు" - 15 నిమిషాల్లో చట్నీతో సహా రెడీ చేసుకోవచ్చు!