Perugu Dosa : ఎండలు దంచి కొడుతున్నాయి. ఇల్లు విడిచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో కూర్చున్నా దాహం తీరదు. ఏది తినాలన్నా మనసుకు నచ్చదు. అదే పనిగా చల్లటి నీళ్లు ఎన్ని తాగినా కడుపు నిండుతుందే తప్ప ఆకలి తీరదు. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు చల్లగా ఉంచడంతో పాటు ఆకలి తీర్చే రెసిపీలు ట్రై చేస్తే బాగుంటుంది. ఎప్పుడూ వేసుకునే దోసెలకు బదులు పెరుగు దోసెలు వేసుకుని తిని చూడండి. ఈ ఎండల సమయంలో ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పెరుగు దోసెలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచివే.
రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!
పెరుగు దోసెలకు కావాల్సిన పదార్థాలు
- దోసెలు వేసుకోవడానికి పిండి
- పెరుగు - అర లీటరు
- కొబ్బరి ముక్కలు - 20గ్రాములు
- అల్లం - ఒక ఇంచు
- పచ్చి మిర్చి - 3
- ఉప్పు - కొద్దిగా
- పసుపు - పావు టీ స్పూన్
- పంచదార - 1 స్పూన్
- క్యారెట్ 1 - తురుము
- కొత్తి మీర - తురుము
తాలింపు కోసం
- నూనె - 1 టేబుల్ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 స్పూన్
- మినప్పప్పు - 1 స్పూన్
- ఆవాలు- 1 స్పూన్
- ఎండు మిర్చి -2
- జీలకర్ర - 1 స్పూన్
- ఇంగువ - చిటికెడు
- పసుపు - పావు టీ స్పూన్
- కరివేపాకు - ఒక రెమ్మ
- ఉల్లిపాయలు - 1 మీడియం సైజు
తయారీ విధానం
- ముందుగా దోసె పిండి కోసం ఉదయాన్నే ఒక గిన్నె తీసుకుని కప్పు మినప్పప్పు, 2 గ్లాసుల బియ్యం పోసుకుని నీళ్లలో నానబెట్టుకోవాలి. అందులో కొద్దిగా మెంతులు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుని 5గంటలు నాననివ్వాలి.
- సాయంత్రానికి నీళ్లు వడకట్టి పప్పు, బియ్యం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని రాత్రంతా మారినేట్ చేసుకుంటే ఉదయాన్నే దోసె పిండి రెడీగా ఉంటుంది.
- ఇపుడు అర లీటరు పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుని చిక్కగా బీట్ చేసుకోవాలి.
- మిక్సీలోకి కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చి మిర్చి వేసుకుని రుబ్బుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా పంచదార వేసుకుని కలుపుకోవాలి.
- అందులోనే క్యారెట్, కొత్తిమీర తురుము కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు తాలింపు కోసం ఒక గిన్నెలో కొద్దిగా నూనె పోసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసుకుని వేయించాలి. చివరగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని పూర్తిగా మగ్గనివ్వకుండానే దించుకోవాలి.
- ఈ పోపు మిశ్రమాన్ని పెరుగులో కలుపుకుంటే సరిపోతుంది.
- ఇపుడు పొయ్యి మీద దోసె పెనం పెట్టి వేడెక్కిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గరిటెతో దోసె పిండి తీసుకుని చిన్న చిన్నగా ఊతప్పం సైజులో మూడు దోసెలు వేసుకోవాలి. వాటి చుట్టూ కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకుని రెండోవైపు తిరగేయాలి.
- కాల్చిన దోసెలను పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. (ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు) ఐదారు నిమిషాల తర్వాత వీటిని తీసుకుని తింటే చల్లచల్లగా ఎంతో రుచిగా ఉంటాయి. తిన్న తర్వాత కడుపులో చల్లగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఒకసారి తిని చూస్తేనే ఆస్వాదించవచ్చు.
'దహీ ఇడ్లీ' సింపుల్ టిప్స్తో ఇలా ట్రై చేయండి - ఒక్కటి కూడా వదలరు
టిఫిన్ సెంటర్ "కారం పొడి" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది