Crispy Chitti Punugulu : అసలు విషయం తెలిస్తే పునుగుల తయారీ పెద్ద సబ్జెక్టే కాదు. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా, పులియబెట్టి చేసుకోవాలన్నా వేర్వేరు పద్ధతులున్నాయి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే సోడా వేసుకోవడం, పెరుగు కలపడం, రుచికరంగా రావాలంటే మైదా వాడడమే మార్గమని అనుకుంటారు చాలా మంది. కానీ, గుంటూరు, విజయవాడల్లో దొరికే చిట్టి పునుగులు పైకి క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో మైదా పిండి వాడరు. ఒక రోజు ముందుగా పిండి కలిపి పెట్టుకుని చేస్తుంటారు. కాసింత ఇడ్లీ రవ్వ కూడా కలిపి చేసే ఈ చిట్టి పునుగులు ఎంతో టేస్టీగా ఉంటాయి. మైదా వాడకుండా, సోడా కలపకుండా బియ్యం పిండితో చేసే ఈ పునుగులు కరకరలాడుతుంటాయి.
నోరూరించే "సొరకాయ పచ్చికారం" - ఈ పదార్థం వేసి కూర వండండి, టేస్ట్ అస్సలు మర్చిపోలేరు!
కావాల్సిన పదార్థాలు
- మినప్పప్పు - కప్పు
- బియ్యం పిండి - కప్పు
- ఇడ్లీ రవ్వ - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - పునుగులు వేయించడానికి
తయారీ విధానం :
ముందుగా నాణ్యమైన మినప్పప్పు శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. వానాకాలంలో అయితే తప్పని సరిగా వీటిని కనీసం నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కాబట్టి రెండు, మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇపుడు మినప్పప్పు కొలిచిన గిన్నెతో పొడి బియ్యం పిండి కొలిచి పెట్టుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ తడుపుకుంటూ నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. కొంచెం తడిసేలా నానబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత మినప్పప్పు కొలిచిన కప్పుతోనే అర కప్పు ఇడ్లీ రవ్వ నాన బెట్టుకోవాలి.
నాలుగు గంటల పాటు పూర్తిగా నానిపోయిన మినప్పప్పును కొద్ది కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని దూదిలాగా మిక్సీ పట్టుకోవాలి. క్వాలిటీ మినప్పప్పు దూదిలాగా వస్తుంది. ఆ తర్వాత రవ్వలో నీళ్లన్నీ తీసి గట్టిగా పిండుకుని వేసుకోవాలి. చివరగా తడిపి పెట్టిన బియ్యం పిండిని వేసుకుని అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే, కొంత మంది బియ్యం నానబెట్టి గ్రైండ్ చేస్తుంటారు. దాంతో సోడా కలపాల్సి వస్తుంది. కానీ, మినప్పప్పును గ్రైండర్ లో వేసుకోవడం, రాత్రంతా నానబెట్టడం వల్ల సోడా లేకుండానే గుల్లగా వస్తాయి. ఇపుడు పిండిపై మూత పెట్టుకుని సాయంత్రం వరకు పులియబెట్టుకోవాలి. పునుగులు ఉదయం కావాలంటే సాయంత్రం(రాత్రంతా), సాయంత్రం కావాలంటే ఉదయం (పగలంతా) పులియబెట్టుకోవడం తప్పనిసరి. ఈ పిండిని మరో సారి కలుపుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ బియ్యం పిండి పునుగులు పైకి చూడడానికి నూనె పట్టినట్లు అనిపించినా లోపల గుల్లగా కరకరలాడుతుంటాయి. వేడి వేడిగా పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తినేయొచ్చు.
చికెన్ పచ్చళ్ల ధర ఎక్కువనిపిస్తోందా?! - పక్కా కొలతలతో ఇంట్లోనే ఇలా పెట్టుకోండి!
"స్వీట్షాప్ స్టైల్ పాలకోవా" - ఇంట్లో ఈజీగా చేసుకోండి - నోట్లో వెన్నలా కరిగిపోతుంది!