Hotel Style Palli Chutney at Home: హల్లో ఫుడ్డీస్.. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ బోర్ కొట్టేస్తున్నాయా? అయితే ఆగండి! మీ టేస్ట్ బడ్స్కి ఒక సూపర్ కిక్ ఇవ్వడానికి మీకోసం పాల్వంచ స్టైల్ చట్నీ రెసిపీ తీసుకొచ్చాం. ఇది మామూలు చట్నీ కాదు, పల్లీలు, పుదీనా, కొబ్బరి కాంబినేషన్లో ఒక ఊర మాస్ టేస్ట్నిస్తుంది. ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాంబో ఇదే అయిపోతుంది. సోషల్ మీడియాలో మీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వైరల్ అవ్వాలంటే ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- పల్లీలు - అర కప్పు
- కరివేపాకు - ఒక రెమ్మ
- పుదీనా ఆకులు - 20
- పచ్చిమిర్చి - సరిపడా
- పుట్నాల పప్పు - పావు కప్పు
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్
- పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
- నూనె - ఒక టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చిన్న ఉల్లిపాయలు -4
- కొత్తిమీర - ఒక పిడికెడు

తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- మినప్పప్పు - అర టీ స్పూన్
- పచ్చిశనగపప్పు - అర టీ స్పూన్
- జీలకర్ర - పావు టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - ఒక రెమ్మ

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి వేయాలి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే పాన్లో (అవసరమైతే కొద్దిగా నూనె వేసుకొని) కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి.
- ఆ తర్వాత పుదీనా ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- పుదీనా, పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా పల్లీలు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి.
- పల్లీలు ఉన్న ప్లేట్లోకి పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు కూడా వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
- చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉల్లిపాయలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొత్తిమీర, కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చట్నీ మరీ గట్టిగా ఉంటే, కావలసిన కన్సిస్టెన్సీ కోసం ఒక కప్పు లేదా మరికొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
- గ్రైండ్ చేసిన చట్నీని తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
- నూనె వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మినపగుళ్లు, పచ్చిశనగపప్పు వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
- అనంతరం జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. చివరగా ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- తయారు చేసిన తాలింపును గ్రైండ్ చేసిన చట్నీలో వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన పాల్వంచ స్టైల్ చట్నీ రెడీ. దీన్ని ఇడ్లీ, దోస, వడ, ఉప్మా లేదా మసాలా దోసతో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది.
టిప్స్:
- వేయించిన పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పచ్చడి రుచి మారుతుంది.
- కావాలంటే కొద్దిగా పసుపును తాలింపులో వేసుకోవచ్చు.
ఈ టిప్స్తో "జొన్న రొట్టెలు" పూరీల్లా పొంగుతాయి - గంటల పాటు సూపర్ సాఫ్ట్!