Hanuman Jayanti Special Recipes : హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో హనుమాన్ జయంతి ఒకటి. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న శనివారం వచ్చింది. ఇక ఆ రోజున ఆంజనేయుడికి చాలా మంది పాయసం, పరవన్నం చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఈసారికి సరికొత్తగా ప్రసాదాలు చేయండి. అందుకోసం మీకోసం రెండు రకాల రెసిపీలు తీసుకొచ్చాం. ఇవి రెండూ చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఈ రెసిపీలు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి లేట్ చేయకుండా ఆ ప్రసాదాలు ఎలా చేయాలో ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
గుమ్మడి పూరీలు:
కావాల్సిన పదార్థాలు:
- గుమ్మడికాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
- నూనె - వేయించడానికి సరిపడా
- గోధుమపిండి - 2 కప్పులు
- బెల్లం - కప్పు
- బియ్యప్పిండి - 2 టేబుల్స్పూన్లు
- యాలకుల పొడి - చెంచా
- జాజికాయ పొడి - చిటికెడు
- గుమ్మడి గింజలు - ఒకటిన్నర చెంచా

తయారీ విధానం:
- గుమ్మడికాయను సగానికి కట్ చేసుకుని దానిపై ఉండే పొట్టు, గింజలు తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నీరు పోసుకోవాలి. ఆపై దాని మీద మూత ఉంచి గుమ్మడి ముక్కలు ఉంచాలి. ఆ ముక్కలపై మూత ఉంచి ఆవిరికి మెత్తగా ఉడికించుకోవాలి.
- గుమ్మడి ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్లో వేసుకోవాలి. ఆపై అందులోకి బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి గోధుమపిండి, బియ్యప్పిండి, 2 చెంచాల నూనె, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఏమైనా అవసరమనుకుంటే కొద్దికొద్దిగా పోసుకుంటూ మెత్తగా కలిపి మూత పెట్టి సుమారు పావు గంట పక్కన ఉంచాలి.
- పిండి నానిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి.
- చపాతీ పీట మీద లైట్గా నూనె అప్లై చేసి ఓ ఉండను ఉంచి పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కుకీ కటర్ లేదా షార్ప్గా ఉన్న డబ్బామూతతో నొక్కి చిన్న పూరీల్లా కట్చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా పిండి మొత్తాన్ని పూరీల్లా చేసుకుని ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత చేసుకున్న పూరీలను వేసుకుని బంగారు రంగు వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి. అన్నీ అయ్యాక గుమ్మడి గింజలతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ గుమ్మడి పూరీలు రెడీ.
అనాస పాయసం:
కావలసినవి:
- గోధుమరవ్వ- 1 కప్పు
- అనాసపండు ముక్కలు - 1 కప్పు
- పెసరపప్పు - అర కప్పు
- బెల్లంపొడి - 3 కప్పులు
- కొబ్బరిపాలు - 7 కప్పులు
- నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - గుప్పెడు
- ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా
- కిస్మిస్ - పావు కప్పు
- యాలకులు - 6
- ఉప్పు - చిటికెడు
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను వేయించి పక్కనుంచాలి.
- అదే పాన్లో గోధుమరవ్వ, పెసరపప్పులను విడివిడిగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- గోధుమ రవ్వ, పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఆపై అందులోకి అనాస ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి 2 లేదా మూడు విజిల్స్ వచ్చేవరకు అంటే మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.
- మరో స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి బెల్లం, నీళ్లు వేసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి పక్కన ఉంచాలి.
- కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఓ సారి కలిపి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాత్ర పెట్టి అందులోకి ఉడికించిన రవ్వ మిశ్రమం, బెల్లం పాకం, దంచిన యాలకులు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి.
- ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపాలు, మిగిలిన నెయ్యి, డ్రై ఫ్రూట్స్ జోడించి సన్నసెగ మీద ఉడికించాలి.
- మధ్యలో కలపుతూ చిక్కగా అయ్యేవరకు ఉడికించి దించేస్తే రుచికరమైన అనాస పాయసం సిద్ధమైపోతుంది. ఈ రెండు ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ఆరగిస్తే సరి.
హనుమాన్ జయంతి స్పెషల్ - క్రిస్పీ అండ్ టేస్టీ "ఆంజనేయ వడలు" - స్వామికి నైవేద్యంగా పెట్టండి!