అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!
- చట్నీ లేకుండానే కమ్మగా తినే అట్లు - పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తినేస్తారు!

Published : August 31, 2025 at 10:30 AM IST
Ganji Atlu Making Process : మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కోసారి ఏం టిఫెన్ చేయాలో తోచదు. అలాగే, సమయానికి ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి వంటివి రెడీగా ఉండవు. అలాంటి సందర్భాల్లో ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. దీన్ని మీరు ఇప్పటివరకు ట్రై చేసి కూడా ఉండరు. అదే, గంజితో సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ "అట్లు". అన్నం వార్చి పోరబోసే గంజితో కూడా కమ్మని దోశలు వేసుకోవచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉండి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. పైగా వీటి తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే, ఈ అట్లను చట్నీ లేకుండానే నేరుగా తిన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి, గంజితో సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ అట్లు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన ఇంగ్రీడియంట్స్ :
- బియ్యప్పిండి - ఒక కప్పు
- గంజి నీళ్లు - తగినన్ని
- ఉల్లిపాయ - ఒకటి
- సన్నని అల్లం తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి - రెండు
- సన్నని క్యారెట్ తురుము - రెండు చెంచాలు
- కొత్తిమీర తరుగు - కొంచెం
- ఉప్పు - రుచికి తగినంత
- జీలకర్ర - పావు చెంచా
- నూనె - కొద్దిగా(అట్టుపై వేసుకోవడానికి)
అచ్చం టిఫెన్ సెంటర్ రుచితో "బోండాలు" - మైదా, వంటసోడా లేకుండానే!

తయారీ విధానం :
- ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే, సన్నని అల్లం తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగుని ముందుగానే రెడీ చేసుకోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యప్పిండిని తీసుకొని అందులో తగినంత వేడి గంజిని(అన్నం వార్చిన నీళ్లు) కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త చిక్కగా ఉండేలా కలుపుకోవాలి.
- ఇక్కడ పిండి కలపడం కోసం నీళ్లకు బదులుగా గంజిని తీసుకుంటున్నాం. అయితే, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా, గట్టిగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి.
ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం రుచికి ఫిదా!

- పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, సన్నని క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
- అలాగే, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి ఒక అరగంట నుంచి గంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని మరొకసారి కలిపి అట్లు వేసుకోవాలి.

- ఇందుకోసం స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒకట్రెండు చెంచాలు తీసుకొని రవ్వ దోశ వేసుకునేటట్లుగా చిన్న అట్టు వేసుకోవాలి.
- అట్టు వేసుకున్నాక దానిపై కొద్దిగా నూనె వేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అది వన్సైడ్ చక్కగా కాలిన తర్వాత మరో వైపునకు టర్న్ చేసి అటు వైపు కూడా కాసేపు కాల్చుకొని తీసుకుంటే చాలు. అంతే, గంజితో కమ్మని "అట్లు" తయారు అవుతాయి!

చిట్కాలు :
- ఈ రెసిపీ కోసం తీసుకునే గంజి వీలైనంత వరకు వేడిగానే ఉండాలి. ఒకవేళ చల్లారితే వేడి చేసుకొని తీసుకోవాలి.
- పెనం బాగా వేడయ్యాక మాత్రమే అట్టు వేసుకోవాలి. అలాగే, అట్టు వేసుకునే ప్రతిసారి పిండిని కలిపి వేసుకోవాలి. అప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది.
- ఇక్కడ మీరు ఎక్కువ మొత్తంలో అట్లు ప్రిపేర్ చేసుకోవాలంటే బియ్యప్పిండితో పాటు ఇతర ఇంగ్రీడియంట్స్ని పెంచి తీసుకుంటే సరిపోతుంది.

అమ్మమ్మల పద్ధతిలో "చామగడ్డ గోంగూర పులుసు" - పుల్ల పుల్లగా, కమ్మగా భలే ఉంటుంది!

