Fish Pulusu without Tamarind: చేపలు పులుసు. ఈ పేరు చెబితే చాలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎందుకంటే కారం, ఉప్పు, మసాలాలు పట్టించి చింతపండు రసంలో ఉడికించడం వల్ల రుచి అద్దిరిపోతుంది. అందుకే చాలా మంది తరచుగా ఈ పులుసును పెట్టుకుని తింటుంటారు. అయితే చేపల పులుసు పెట్టాలంటే కచ్చితంగా చింతపండు అనేది ఉండాలి. కానీ చింతపండుతో చేసే కూర కారణంగా చాలా మందిని గ్యాస్ట్రబుల్ సమస్య వేధిస్తుంటుంది. దీంతో తినాలని ఉన్నా తినలేని పరిస్థితి. అయితే అలాంటి వారు ఓసారి చింతపండు లేకుండా చేపల పులుసు పెట్టుకోండి. టేస్ట్ మరో లెవల్. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:
మారినేట్ కోసం:
- చేప ముక్కలు - 1 కేజీ
- ఉప్పు - అర టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- నిమ్మరసం - అర చెక్క

కూర కోసం:
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ పేస్ట్ - అర కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- కారం- 2 టీ స్పూన్లు
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి - ముప్పావు టీ స్పూన్
- నీరు - 3 కప్పులు
- మామిడి కాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- ముందుగా చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
- ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- మామిడికాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కలను టెంకతో సహా కుక్కర్లో వేసి సరిపడా అంటే ముక్కలు మునిగేవరకు నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి.
- ఆవిరి పోయిన తర్వాత మూత తీసి టెంకను పిండి మిగిలిన ముక్కలను గుజ్జుగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చెయ్యాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
- అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మసాలాలను ఫ్రై చేయాలి. అయితే ఇక్కడ ఉప్పు, కారం అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలను మారినేట్ చేసినప్పుడు అందులోకి ఉప్పు, కారం కలిపాము. కాబట్టి రుచికి తగినట్లుగా వేసుకోవాలి.
- మసాలాలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసుకుని కలిపి మరిగించుకోవాలి.
- వాటర్ మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసి నిధానంగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
- అనంతరం మూత తీసి ముందే చేసుకున్న మామిడికాయ గుజ్జు, కొంచెం కొత్తమీర వేసి కలిపి మూత పెట్టి సిమ్లో సుమారు 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
- చేప ముక్కలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.

టిప్స్:
- మామిడికాయను పుల్లగా ఉన్నది తీసుకుంటే పులుసు రుచి బాగుంటుంది.
- మీరు ఈ పులుసును మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా కొబ్బరి పాలు జోడించవచ్చు.
- చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు, లేకపోతే అవి విరిగిపోతాయి.
ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్ "కొర్రమీను చేపల పులుసు" - అద్దిరిపోయే రుచితో ప్లేట్లు నాకాల్సిందే!
తాజా చేపల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తారు - కొనేటప్పుడు ఇలా గుర్తుపట్టండి!