Healthy Breakfast Recipe in Telugu : మనందరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, దోశ, పూరీ, ఉప్మా వంటి రకరకాల టిఫెన్స్ చేసుకొని తింటుంటాం. కానీ, మన అమ్మమ్మల కాలంలో వీటికి బదులుగా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినేవారు. అదే, "ఆవిరి కుడుములు". మినపప్పుతో ప్రిపేర్ చేసుకునే వీటిలో ఐరన్, కాల్షియంతో పాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని తినొచ్చు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, ఆడవారికి, బలహీనంగా ఉన్నవారి శరీర పుష్టికి ఈ ఆవిరి కుడుములు ఎంతగానో ఉపయోగపడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి! మరి, పాతకాలం నాటి ఈ ఆవిరి కుడుములను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
టిప్స్ :
- ఆవిరి కుడుముల కోసం పొట్టు మినపప్పును తీసుకోవాలి. దీనితో చేసుకోవడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. అయితే, అది లేని వారు నార్మల్ మినపగుండ్లను తీసుకోవచ్చు.
- ఇక్కడ బియ్యాన్ని తీసుకోవడం ద్వారా ఆవిరి కుడుములు టేస్టీగా, నోటికి చుట్టుకురాకుండా వస్తాయి.
- ఈ రెసిపీ కోసం పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- పొట్టు మినపప్పు - ఒకటిన్నర గ్లాసులు
- బియ్యం - 3 టీస్పూన్లు(గుప్పెడు)
- ఉప్పు - రుచికి తగినంత
పిల్లలు స్వీట్ అడిగితే - ఇలా "తియ్యటి పూరీలు" చేసి పెట్టండి! - కనీసం 15 రోజులు నిల్వ!

తయారీ విధానం :
- ఈ హెల్దీ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో పొట్టు మినపప్పు, బియ్యాన్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 నుంచి 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు రాత్రి పడుకునే ముందు మినపప్పుని కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది.
- ఆవిధంగా నానబెట్టుకున్నాక మరుసటి రోజు మార్నింగ్ మరోసారి మినపప్పుని చేతితో నలుపుతూ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
- అయితే, నానబెట్టుకున్న మినపప్పును పొట్టు మొత్తం పోయేలా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పొట్టుతో ఉంటేనే ఆవిరి కుడుములు టేస్టీగా ఉంటాయి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న మినపప్పు, ఉప్పుతో పాటు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వడల పిండి మాదిరిగానే కాస్త గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి.
- ఆపై పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక తెల్లటి కాటన్ వస్త్రం, అంచులు ఉన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి, తడి కాటన్ వస్త్రాన్ని గిన్నెపైన ఉంచి అంచుల కింద దారంతో టైట్గా కట్టాలి.
- తర్వాత వస్త్రం పైన ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక మూడు గరిటెలు వేసి చేతిని తడి చేసుకొని అప్పం మాదిరిగా క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి.
- ఆపై అంచుల వెంట మిగిలిన వస్త్రాన్ని పిండిపై వేసి మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలి.
- ఇప్పుడు ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి దానికి సరిపడా మరో గిన్నెను మూతలా బోర్లించి లో టూ మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

- అనంతరం ఒక సారి మూత తీసి అది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక స్పూన్తో గుచ్చి తీస్తే క్లీన్గా వస్తే సరిగా కుక్ అయిందని తెలుసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకట్రెండు నిమిషాలు ఆగి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరమైన "మినప ఆవిరి కుడుములు" మీ ముందు ఉంటాయి.
- మిగిలిన పిండిని ఇదే ప్రాస్స్లో వీలైనన్ని ఆవిరి కుడుములు చేసుకోవాలి.
- ఇక వీటిని కారప్పొడిలో కాస్త నెయ్యి వేసుకొని అద్దుకొని తింటుంటే ఆ టేస్ట్ భలేగా ఉంటుంది. లేదంటే మీకు నచ్చిన చట్నీతో ఆవిరి కుడుములు ఆరగించవచ్చు.

ఎగ్ నూడుల్స్ని మించిన టేస్ట్తో "కోడిగుడ్డు సేమియా" - ఇలా చేస్తే పొడి పొడిగా!
పిండిని ఇలా కలిపి "చపాతీలు" చేసుకోండి - ఎన్ని గంటలైనా సూపర్ సాఫ్ట్! - పూరీల్లా పొంగుతాయి!