Who is Abu Mohammed al-Golani : పశ్చిమాసియా దేశమైన సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది. అందుకు కారణమైన తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహించినదే హయాత్ హయాత్ తహరీర్ అల్-షామ్ (హెచ్టీఎస్) సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అధినేత అబూ మహమ్మద్ అల్-జులానీ ప్రస్థానం అందరిలో ఆసక్తితో పాటు, గుబులూ రేకెత్తిస్తోంది. కారణం ఈ హెచ్టీఎస్ నేత ఒకప్పడు అల్ఖైదా ఉగ్రవాది కావడమే.
9/11 దాడులే స్ఫూర్తి
సౌదీ అరేబియాలో జన్మించిన 41 ఏళ్ల అల్-జులానీ మూలాలు అల్ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. తండ్రి పెట్రోలియం ఇంజినీర్. జులానీ చిన్నతనంలో అతడి కుటుంబం సిరియాలోని డమాస్కస్ సమీపంలో స్థిరపడింది. అమెరికాపై జరిగిన 9/11 దాడులు జులానీని ఉగ్రవాదంవైపు మళ్లేలా చేశాయి. 2003లో జులానీ ఇరాక్ వెళ్లి అల్ఖైదాలో చేరాడు.
ఐదేళ్లు అమెరికా జైల్లోనే
అనతికాలంలోనే జులానీ అల్ఖైదాలో పేరు తెచ్చుకున్నాడు. అయితే 2006 ఇరాక్లోని అమెరికా దళాలు అతడిని అరెస్టు చేశాయి. ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించి బయటకొచ్చాడు. అనంతరం జులానీకి అల్ఖైదా కీలక బాధ్యతలు అప్పగించింది. సిరియాలో ఆల్ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జులానీ, అల్ నుస్రా ఫ్రంట్ను ఏర్పాటు చేశాడు.
ఐసిల్తోనూ అనుబంధం
సిరియాలో 'అల్ నుస్రా ఫ్రంట్' కార్యకలాపాల విస్తరణలో అల్-జులానీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడే ఆయనకు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ (ఐఎస్ఐ) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదితో సంబంధాలు ఏర్పాడ్డాయి. ఈ ఐఎస్ఐ తర్వాత ఐసిల్గా మారింది. 2013లో అబూ బకర్ అల్ఖైదాతో సంబంధాలు తెంచుకున్నాడు. దీంతో అల్-జులానీ మళ్లీ తన విధేయతను ఆల్ఖైదాకు ప్రకటించాడు.
అల్ఖైదాతో కటీఫ్
2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరియాలో పాలన ఇస్లామిక్ చట్టాల ప్రకారం జరగాలని జులానీ పేర్కొనడం గమనార్హం. 2016లో తన గ్రూపు పేరు జబాత్ ఫతే అల్-షామ్గా మార్చాడు. 2017లో అన్ని గ్రూపులను కలిపి హయాత్ తహరీర్ అల్-షామ్ (హెచ్టీఎస్)ను ఏర్పాటు చేశాడు. నియంత అసద్ పాలన నుంచి సిరియాను విముక్తి చేయడమే హెచ్టీఎస్ లక్ష్యమని ప్రకటించాడు.
హెచ్టీఎస్ నిషేధిత ఉగ్రసంస్థ
హెచ్టీఎస్ను అమెరికా, తుర్కియే సహా పలు పశ్చిమదేశాలు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఐరాస కూడా ఉగ్రసంస్థల జాబితాలో చేర్చింది. ఆసక్తికరమేంటంటే హెచ్టీఎస్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన తుర్కియే ఇప్పుడు అల్ జులానీకి అండగా నిలిచింది.