JD Vance Usha India Visit : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉష భారత్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 24వ తేదీన వరకు వారి పర్యటన కొనసాగనుంది. అలాగే ఆయన ఇటలీలోనూ పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్ భారత్కు రావడం ఇదే మొదటిసారి. పైగా ఆయన సతీమణి ఉష తెలుగమ్మాయి కావడం విశేషం.
అయితే ఇటలీ, భారత్ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాధినేతలతో జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నట్లు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం బుధవారం వెల్లడించింది. అదే సమయంలో భారత పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ దంపతులు దిల్లీ, జైపుర్, ఆగ్రాను సందర్శించనున్నారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కూడా కానున్నారు.
ఇక జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత యేల్ లా స్కూల్లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
వారి వివాహబంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లులు ఉన్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఎందరి నుంచో ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కార్యక్రమంలో ఉషను కొనియాడారు. ఇప్పుడు ఆమె అమెరికా సెకండ్ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి తొలిసారి రానున్నారు. వెల్కమ్ టు ఇండియా మేడమ్!