US Remittance Tax : అమెరికాయేతర పౌరులపై మరో భారం మోపే దిశగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. అమెరికాలో ఉన్న ప్రవాసీయులు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై 5శాతం పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు తీసుకురానున్నారు. విదేశీయులు సహా హెచ్-1బీ, గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. అయితే, అమెరిక పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైనా ప్రభావం చూపనుందని ఆర్థికరంగ నిపుణలు అంచనా వేస్తున్నారు.
అమెరికా నుంచి వస్తున్న 118.7 బిలియన్ డాలర్లు
ఆర్బీఐ లెక్కల ప్రకారం అమెరికా నుంచే భారత్కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో 55.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023-24 నాటికి 118.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27శాతం (32 బిలియన్ డాలర్లు) రాగా దానిపై 5శాతం పన్ను అంటే 1.64 బిలియన్ డాలర్లు అవుతుంది. ఇక గతంలో భారత్కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ నగదు బదిలీ రూపంలో వస్తుండగా క్రమంగా అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచి రావడం ప్రారంభమైంది. అయితే, భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికిపైగా (2023-24లో వచ్చిన) అభివృద్ధి చెందిన దేశాలనుంచే వస్తుండగా, ఇందులో అమెరికా అగ్రస్థానంలో ఉంది.
2008 నుంచి అగ్రస్థానంలో భారత్
మరోవైపు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11శాతం ఉండగా 2024నాటికి 14శాతానికి చేరింది. ప్రస్తుతం దాదాపు 129 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మన తర్వాతి స్థానాల్లో మెక్సికో (68 డాలర్లు), చైనా (48 బి.డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (33 బిలియన్ డాలర్లు) దేశాలు ఉన్నాయి.