US Strikes Houthis In Yemen : యెమెన్లోని హూతీ ఉగ్రవాదులపై ఆదివారం రాత్రి చేసిన క్షిపణి దాడిలో సుమారు 30 మంది మరణించారు. హూతీల ఏరివేత లక్ష్యంగా మార్చి 15 నుంచి అమెరికా వారిపై యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో నెలన్నరలో ఇప్పటివరకు హూతీలపై సుమారు 800 క్షిపణులతో దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. తమ దూకుడు వల్ల అంతర్జాతీయ నౌకలపై హూతీల దాడులు తగ్గినట్లు తెలిపింది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు 69శాతం, డ్రోన్ దాడులు 55శాతం తగ్గినట్లు వివరించింది.
హూతీలపై దాడుల తీవ్రతను మరింత పెంచుతాం. వారు నౌకలపై దాడులను నిలిపివేసి ప్రశాంత వాతవారణం వచ్చేవరకు దాడులు చేస్తాం. ఆపరేషన్ రఫ్రైడర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 800 క్షిపణి దాడులు చేశాం. దీంతో వందలాది హూతీ ఉగ్రవాదులతో పాటు నేతలు, అధికారులు మరణించారు. ఇంకా అనేక కార్యాలయాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తి, భద్రత వ్యవస్థలను ధ్వంసం చేశాం.
--అమెరికా సెంట్రల్ కమాండ్
హూతీల ఉగ్రవాద కార్యకలపాలకు ఆదాయం అందించే రాస్ ఇసా చమురు పోర్ట్ పైన దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ వైమానిక దాడుల్లో 74 మంది మృతి చెందగా, మరో 171 మందికి గాయాలయ్యాయి. హూతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే దాడులు చేపట్టామని తెలిపింది. దీని ఆధారంగానే హూతీలు మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వివరించింది.
ఇప్పటికీ హూతీలకు ఇరాన్ సాయం చేస్తూనే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ మద్దతు వల్లే తమ దళాలతో హూతీలు పోరాడగలుతున్నారని అభిప్రాయంపడింది. తమ లక్ష్యమైన స్వేచ్ఛాయుత నౌకాయనం జరిగేవరకు దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అటు హూతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. హూతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య, యుద్ధ నౌకలపై దాడులు ఆపాలనే లక్ష్యంతో యెమెన్లోని హౌతీలపై మార్చి 15న అమెరికా సైనిక చర్యను మొదలుపెట్టింది.
ఇరాన్ పోర్ట్లో భారీ పేలుడు ఘటన- 40కు చేరిన మృతుల సంఖ్య
భారీ పేలుడు ధాటికి 25మంది మృతి- కిలోమీటర్ల దూరంలోని భవనాలు ధ్వంసం