US Attack on Yemen : యెమెన్పై అమెరికా చేపట్టిన వైమానిక దాడుల్లో 74 మంది మృతి చెందారు. మరో 171 మందికి గాయాలయ్యాయి. యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులను అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్తో పాటు హౌతీ ఆరోగ్య శాఖ సైతం ధ్రువీకరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కాగా, ప్రస్తుతం రాస్ ఇసా చమురు పోర్టు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉంది.
హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే దాడులు చేపట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. యెమెన్లోని ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టలేదని వివరించారు. హౌతీల ఆదాయ వనరులను దెబ్బతీయాలనే దాడులు చేసినట్లు చెప్పారు. మార్చి 15న హౌతీలపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇదే అతిపెద్ద దాడని తెలిపారు.
ఇప్పటికే ఎర్ర సముద్రంలో వాణిజ్య, యుద్ధ నౌకలపై దాడులు ఆపాలనే లక్ష్యంతో యెమెన్లోని హౌతీలపై అమెరికాలో సైనిక చర్యను మొదలుపెట్టింది. యెమెన్లోని తిరుగుబాటుదారులు ఇక నుంచి దాడులు ఆపాలని లేకుంటే నరకం చూపిస్తామని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడు చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పారు. అటు హౌతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్కు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. హౌతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదని తేల్చి చెప్పారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను 2023 నుంచి లక్ష్యంగా చేసుకున్నారు. 2023 నుంచి హూతీలు అమెరికా యుద్ధనౌకల లక్ష్యంగా 174 సార్లు, వాణిజ్య నౌకల లక్ష్యంగా 145 సార్లు దాడులు చేశారని పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు.