Trump Pauses Tariffs : అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకుడుగు వేశారు. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొంది. అంతేకాకుండా చైనాపై సుంకాలను 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.
చైనా తప్ప మిగిలిన దేశాల వస్తువులపై 10 శాతం బేస్లైన్ సుంకం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. 75 కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరిపాయని తెలిపింది. ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడం వల్ల తాను ప్రకటించిన టారిఫ్లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 10 శాతం బేస్లైన్ సుంకం మాత్రం ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
US President Donald Trump raises the Tariff charged to China by the US to 125% with immediate effect, also authorises a 90-day PAUSE and a substantially lowered Reciprocal Tariff during this period of 10% on over 75 countries with immediate effect. https://t.co/H0fKNAdZTU
— ANI (@ANI) April 9, 2025
చైనాతో టారిఫ్ యుద్ధమే
అటు చైనాపై మాత్రం అమెరికా సుంకాల యుద్ధం కొనసాగిస్తోంది. ఒక్కరోజు తేడాలోనే చైనా మరోసారి అమెరికా సుంకాలను భారీగా పెంచింది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను 104 నుంచి 125కు పెంచుతున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఒక్కరోజు వ్యవధిలోనే చైనా వస్తువులపై 21 శాతం సుంకాన్ని పెంచింది. చైనా వస్తువులపై బుధవారం ఉదయమే 104 శాతం అమెరికా సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా చైనా సైతం అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తీవ్రంగా స్పందించిన అమెరికా డ్రాగన్పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఈయూ రివెంట్ టారిఫ్
మరోవైపు యూరోపియన్ యూనియన్ సైతం ట్రంప్ చర్యల్ని వ్యతిరేకిస్తూ తొలిసారి కీలక ప్రకటన చేసింది. ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధిస్తూ మార్చిలో అమెరికా చేసిన ప్రకటనకు ప్రతిగా అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించాలన్న ప్రతిపాదనకు ఈయూ సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇవి ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని ఈయూ స్పష్టం చేసింది. ఏయే వస్తువులపై సుంకాలు విధిస్తారు, ఎంత శాతం విధిస్తారన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా ఈ సుంకాలు విధించినట్లు తెలుస్తోంది. అమెరికాతో వాణిజ్య పరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది.