Sunita Williams Return : మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్షకేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమ్మీదకు వచ్చేందకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ-10 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోనే ఉంటున్నారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రయోగాన్ని వాయిదా వేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. డ్రాగన్ క్యాప్సుల్లో ఐఎస్ఎస్కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు.
Have a great time in space, y'all!
— NASA (@NASA) March 14, 2025
#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో వారు ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ఎక్స్తో కలిసి పనిచేస్తోంది.
ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలని చెప్పడం వల్ల ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాల వల్ల దాదాపు తొమ్మిది నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపించారు.