UK RAF Planes Damaged : బ్రిటన్ వైమానిక స్థావరంలోకి చొరబడి సైనిక విమానాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన పాలస్తీనా అనుకూలవాదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. పటిష్ఠ భద్రతా వ్యవస్థను దాటుకుని వీరు రాయల్ ఎయిర్ఫోర్స్ బేస్లోకి ఎలా ప్రవేశించారు? అనేదానిపై బ్రిటన్ మిలటరీ సమీక్షిస్తోంది. బ్రిటన్ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
ఇంత దుస్సాహసం ఎలా చేయగలిగారు?
ఇజ్రాయెల్ను విపరీతంగా ద్వేషించే, పాలస్తీనా అనుకూలవాదులు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. సెంట్రల్ ఇంగ్లాండ్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ స్థావరంలోకి చొరబడి, రెండు సైనిక విమానాలపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా టర్బైన్ ఇంజిన్స్పై ఎరుపు రంగు పెయింట్ చల్లారు. క్రౌబార్లతో మరింత నష్టం కలిగించారు. విమానాల్లో ఇంధనం నింపడానికి, ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ రెండు విమానాలను ఉపయోగిస్తోంది. తమ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్స్ఫర్డ్షైర్లోని బ్రిజ్ నార్టన్ ఎయిర్ బేస్లోకి చొరబడి వాయేజర్ జెట్లను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అంగీకరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎయిర్ఫోర్స్ స్థావరంలోకి చొరబడ్డ నిందితులు విమానాలకు నష్టం కలిగించిన వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. రన్వేపైనా పెయింట్ వేసినట్లు, పాలస్తీనా పతాకాన్ని అక్కడ వదిలివెళ్లినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ తెలిపింది.
ఇజ్రాయెల్కు బ్రిటన్ సహకారం!
గాజాపై ఇజ్రాయెల్ దాడులను బ్రిటన్ బహిరంగంగా ఖండించినప్పటికీ, పరోక్షంగా ఆ దేశానికి మద్దతిస్తూనే ఉందని పాలస్తీనా అనుకులవాదులు ఆరోపిస్తున్నారు. సైనిక సరకులను పంపడం, గాజాపై నిఘా విమానాలను ఎగురవేయడం, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం నింపడం వంటి చర్యలను బ్రిటన్ కొనసాగిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఎక్స్లో పోస్టు చేసింది. గాజాలో మారణహోమానికి, మధ్యప్రాశ్చ్యంలో యుద్ధ నేరాలకు బ్రిటన్ పాల్పడుతోందని విమర్శించింది.
దర్యాప్తు ముమ్మరం
సైనిక స్థావరంలోకి ఆ ఇద్దరు నిందితులు ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు బ్రిటన్ పోలీసువర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటన్ రక్షణ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. భద్రతను సమీక్షిస్తోంది.
ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్కు 40 చైనా J-35 జెట్లు- వాటి కోసం భారత్ మరో పదేళ్లు ఆగాల్సిందే!