Russia Air Attacks On Ukraine : ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్ తరువాత కూడా, రష్యా తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క్రీ ఆరోపించారు. ఈ మేరకు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా సుదర్ఘీమైన పోస్ట్ చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజులు పాటు దాడులు నిలిపివేసేలా అమెరికా, మాస్కోల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో దళాలు దాడులు చేసినట్లు ఆరోపించారు.
ఉక్రెయిన్ భూభాగం రష్యా డ్రోన్లు
'నిజంగా రష్యా ఏం కోరుకుంటుందనేదీ ఈ దాడులతో తెలిసిపోతోందని' జెలెన్స్కీ ఆరోపించారు. దాదాపు 40 రష్యా డ్రోన్లు ఉక్రెయిన్ భూభాగాన్ని తాకాయని అన్నారు. దురదృష్టవశాత్తూ పౌరుల మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. సుమీలోని ఆస్పత్రితో పాటు కీవ్, జటోమిర్, చెర్నిహివ్ తదితర ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయని జెలెన్స్కీ వెల్లడించారు.
Right now, in many regions, you can literally hear what Russia truly needs. Around 40 " shahed" drones are in our skies, and air defense is active.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 18, 2025
unfortunately, there have been hits, specifically on civilian infrastructure. a direct hit by a "shahed" drone on a hospital in… pic.twitter.com/TKTeB9gaZy
'శాంతిని కోరే రష్యా ఇలాంటి దాడులు చేస్తోందా?'
"మా ఇంధన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మాస్కో అర్ధరాత్రి వేళ దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. ఉక్రేనియన్ల సాధారణ జీవితానికి ఇవి ఇబ్బందులు కలిగిస్తాయి. యుద్ధాన్ని పొడిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచాధినేతలు స్పందించడం సరైనదే. రష్యా శాంతిని కాంక్షించే ఇలాంటి దాడులు చేస్తుంది కదా!" అని ఎక్స్ వేదికగా రష్యాపై జెలెన్ స్కీ విమర్శలు గుప్పించారు.
ట్రంప్తో మాట్లాడుతా: జెలెన్స్కీ
అంతేకాదు ట్రంప్తో జరిపిన చర్చల్లో పుతిన్ ఏమి మాట్లాడారనే విషయాన్ని తెలుసుకుంటానని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇందుకోసం తాను త్వరలో ట్రంప్తో మాట్లాడతానని చెప్పారు. "రష్యాతో చర్చల విషయంలో ఈ రోజు ట్రంప్తో సంప్రదింపులు జరుపుతాను. యుద్ధ నివారణకు తదుపరి చర్యల గురించి తెలుసుకుంటాను" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
దాడిని ఖండించిన జర్మన్
ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడులపై జర్మన్ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ స్పందించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంపై పుతిన్ ఆటలాడుతున్నారని విమర్శించారు. ఈ తాజా దాడులపై ట్రంప్ కచ్చితంగా స్పందించాలని కోరారు.
యుద్ధ ముగింపునకు ట్రంప్ ప్రయత్నాలు
రష్యా- ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో దీనిపై ఇటీవల చర్చలు జరిగాయి కూడా. అందులో 30 రోజుల కాల్పుల విరమణను అమెరికా ప్రతిపాదించింది. అందుకు ఉక్రెయిన్ సైతం అంగీకరించింది. రష్యా కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్, పుతిన్ మంగళవారం ఫోన్లో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజుల పాటు దాడులు ఆపాలని ట్రంప్ సూచించగా పుతిన్ అందుకు అంగీకరించారు. ట్రంప్ సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. పరస్పరం 175 మంది యుద్ధ ఖైదీలను బుధవారమే అప్పగించుకోనున్నట్లు ట్రంప్నకు పుతిన్ చెప్పారని క్రెమ్లిన్ పేర్కొంది. తీవ్రంగా గాయపడిన 23 మంది ఉక్రెయిన్ సైనికుల్ని కూడా రష్యా అప్పగించనుందని వెల్లడించింది. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఉక్రెయిన్కు చేస్తున్న సైనిక సాయాన్ని ఆపేయాలని పుతిన్ పట్టుబట్టినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. చర్చలకు ఉక్రెయిన్ సమ్మతి ఉందా, లేదా అనేది తెలియలేదు. ఇలాంటి తరుణంలో రష్యా తమపై దాడులు చేస్తోందని జెలెన్స్కీ ఆరోపిస్తుండడం గమనార్హం.