World Press Photo Of The Year 2025 : గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజ్జౌర్ (9) చిత్రం 'వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ 2025'గా ఎంపిక అయ్యింది. ఖతర్ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియాకు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలౌఫ్ 'ది న్యూయార్క్ టైమ్స్' కోసం ఈ ఫొటో తీశారు.
"మహమ్మద్ అజ్జౌర్ తల్లితో నేను మాట్లాడాను. తన రెండూ చేతులు ఇక లేవని తెలియగానే, అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ?" అంటూ ఆ బాలుడు తల్లిని ప్రశ్నించాడు" అని అబూ ఎలౌఫ్ చెప్పిన మాటలను వరల్డ్ ప్రెస్ ఫొటో ఆర్గనైజేషన్ ఈ సందర్భంగా ఊటంకించింది.
68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారు ఏకంగా 59,320 ఎంట్రీలను సమర్పించారు.
"ఇది ఒక బాలుడి కథను, ఆవేదనను బిగ్గరగా చెప్పే ఓ నిశ్శబ్ద ఫొటో. తరతరాలపై ప్రభావం చూపే ఓ పాశవిక, సుదీర్ఘ యుద్ధం గురించి కూడా ఇది చెబుతుంది" అని వరల్డ్ ప్రెస్ ఫొటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జౌమానా ఎల్జీన్ ఖౌరీ అన్నారు.